టీమిండియా- పాకిస్థాన్ దేశాల మధ్య మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులు టీవీల ముందు అతుక్కుపోతారు. ఇక, ఈ మ్యాచ్ జరిగే స్టేడియంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే, వన్డే ప్రపంచకప్ 2023లో తొలి మ్యాచ్ ఈ రెండు దాయాది దేశాల మధ్య జరుగుతుండటం మరింత ఆసక్తి రేపుతుంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో అక్టోబర్ 5న ఈ మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్ వేదికను మార్చాలంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ఐసీసీపై తీవ్ర ఒత్తిడి కూడా తెచ్చింది. అయినా పాక్ మాటను ఐసీసీ పట్టించుకోలేదు. దీంతో చివరికి అహ్మదాబాద్ స్టేడియంలోనే రెండు జట్లు తలపడనున్నాయి.
ఇక, ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ నుంచి ఫుల్ డిమాండ్ నెలకొంది. అయితే, ఈ డిమాండ్ ను సొమ్ము చేసుకునేందుకు అహ్మదాబాద్ లోని ప్రముఖ హోటళ్లు గదుల అద్దెలను ఒక్కసారిగా పెంచేశాయి. ఒక రోజుకు రూమ్ రెంట్ రూ.లక్షకు చేరింది. హోటల్ బుకింగ్ ల సైట్లు పరిశీలిస్తే.. ఈ విషయం తెలుస్తుంది. సాధారణంగా హోటల్ రూమ్ ల ధరలు డైనమిక్ ప్రైసింగ్ విధానంతో ఉంటాయి. ఎక్కువ మంది హోటల్ రూమ్ చార్జీలను తెలుసుకుంటున్నారు.. బుక్ చేసుకోవడానికి ట్రై చేసినా వాటి ధరలు ఆటోమేటిగ్గా పెరిగిపోతాయి.
క్రికెట్ అభిమానుల నుంచి డిమాండ్ పెరగడంతో హోటళ్ల యాజమాన్యాలు లాభాల దక్కించుకునేందుకు రూమ్ రెంట్ లు ఒకేసారి పది రెట్లు పెంచేశారు. ఒక్కో రూమ్ రూ.లక్షకు చేరింది. ఇప్పటికే కొన్ని హోటళ్లలోని గదులన్నీ బుక్ అయ్యాయి. సాధారణ హోటళ్లలోనూ ఒక రోజుకు రూమ్ రెంట్ రూ.5,000-8,000 నుంచి రూ.40,000 వరకు పెరిగింది. ఐటీసీ హోటల్స్ కు చెందిన వెల్ కమ్ హోటల్ లో సాధారణ రోజు అద్దె రూ.5,699గా ఉంటే, మ్యాచ్ జరిగే రోజున రూ.71,999కు పెరిగింది. రినైసెన్స్ అహ్మదాబాద్ హోటల్ లోనూ గది రెంట్ రూ.8,000 నుంచి రూ.90,679కు పెరిగింది. దీంతో రూమ్ అద్దెలను చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు.