Leading News Portal in Telugu

Jammu Earthquake : జమ్ము రాజౌరీలో భూకంపం


Jammu Earthquake : జమ్ముకశ్మీర్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇప్పటికే మూడుసార్లు జమ్ము కశ్మీర్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పలుసార్లు భూమి కంపించింది. ఈ సారి జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీలో భూకంపం సంభవించింది. రాజౌరీలో స్వల్ప భూకంపం సంభవించినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ(ఎన్‌సీఎస్‌) అధికారులు తెలిపారు. రాజౌరీ భూకంపం.. 3.6 తీవ్రతగా నమోదయింది. గురువారం తెల్లవారుజామున 3.49 గంటలకు రాజౌరీలో భూమి కంపించిందని అధికారులు తెలిపారు.

Read also: Prabhas: బెంగుళూరుకి ప్రభాస్… తిరిగి రాగానే ఆ సినిమా షూటింగ్

ఈ రోజు తెల్లవారుజామున 3.49 గంటలకు రాజౌరీలో భూమి కంపించగా.. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.6గా నమోదైనట్టు ఎన్‌సీఎస్‌ ప్రకటించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. అర్ధరాత్రి వేల భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ సమయంలో మెలకువతో ఉన్న వారు కొందరు ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా అందలేదని అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని దోఢా ప్రాంతంలో ఈ నెల 8న అర్ధరాత్రి దాటిన తర్వాత 12.04 గంటలకు 4.9 తీవ్రతతో భూమి కంపించింది. అదేవిధంగా ఆగస్టు 4న గుల్‌మార్గ్‌లో 5.2 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఉదయం 8.36 గంటల ప్రాంతంలో భూమి కంపించిందని ఎన్‌సీఎస్‌ వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌లో తరచు సంభవిస్తున్న భూకంపాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.