Leading News Portal in Telugu

Rishabh Pant Six: మొదటిసారి బ్యాట్ పట్టిన రిషబ్‌ పంత్‌.. సిక్సుల వర్షమే! వీడియో వైరల్‌


Rishabh Pant Plays Cricket For First Time after Car Accident: భారత యువ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ గతేడాది కారు ప్రమాదంకు గురైన విషయం తెలిసిందే. 2022 డిసెంబరు 30న ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో.. పంత్ ఘోరమైన కారు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో పంత్‌కు అనేక గాయాలయ్యాయి. అతని మోకాలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. కొన్ని రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్న పంత్‌.. ఆపై బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఏన్‌సీఏ)లో పునరావాసం పొందుతున్నాడు.

ప్రస్తుతం ఏన్‌సీఏలో ఉన్న రిషబ్ పంత్‌ వేగంగా కోలుకుంటున్నాడు. బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ కూడా మెదలుపెట్టేశాడు. ఇక 8 నెలల తర్వాత పంత్‌ మొదటిసారి మైదానంలోకి దిగి బ్యాట్ పట్టాడు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జేఎస్​డబ్ల్యూ ఫాండేషన్‌ నిర్వహించిన ఓ క్రికెట్ టోర్నీలో పంత్ ఆడాడు. ఆ టోర్నీలో భారీ షాట్లతో విరుచుకుపడి ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్సులు కొడుతూ అభిమానులను అలరించాడు.

ముఖ్యంగా ఫ్రంట్ ఫుట్‌లో ఎక్స్‌ట్రా కవర్ మీదుగా రిషబ్ పంత్ కొట్టిన సిక్స్‌ హైలెట్‌గా నిలిచింది. బంతి వెళ్లి ఏకంగా మైదానం బయట పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ప్రాక్టీస్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ సిక్సర్. స్పైడీ పునరాగమనం కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది’ అని క్యాప్షన్ ఇచ్చారు. సూపర్బ్ పంత్ బయ్యా, త్వరగా జట్టులోకి వచ్చేసేయ్ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పంత్ త్వరగానే అంతర్జాతీయ మైదానంలోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది ఇం‍గ్లండ్‌తో స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్‌తో అతడు పునరాగమనం చేస్తాడని తెలుస్తోంది.