Rahul Gandhi: భారత ప్రధమ ప్రధాన మంత్రి పండిట్ జవహార్ లాల్ నెహ్రూ వారసత్వాన్ని నాశనం చేయడమే బీజేపీ వారి లక్ష్యమని కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఢిల్లీలోని నెహ్రూ మ్యూజియం పేరు మార్పుపై రాహుల్ ఘాటుగా స్పందించారు. నెహ్రూజీ తాను చేసిన పనులను బట్టే ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్) పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీగా మార్చడంపై రాహుల్ గాంధీ గురువారం స్పందించారు. నెహ్రూజీ తాను చేసిన పనులతోనే ప్రజల్లో గుర్తింపు పొందారని.. కేవలం ఆయన పేరుతోనే కాదని రాహుల్ అన్నారు. ప్రధాని మోడీ నెహ్రూ వారసత్వాన్ని నాశనం చేయడం, నిరాకరించడమనే ఏకసూత్ర అజెండాతో ముందుకెళుతున్నారని మండిపడ్డారు. నెహ్రూ వారసత్వంపై ప్రభుత్వ దాడి, అణిచివేత కొనసాగినా నెహ్రూ ఘన వారసత్వం ఉనికిలో ఉంటుందని, రాబోయే తరాలకు నెహ్రూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని స్పష్టం చేశారు.
Read also: Relationship : భర్తను ఎక్కువగా ఇష్టపడుతున్నారా..? ఒక్కసారి ఇది చూడండి..
మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విషయంలో మోడీకి ఎన్నో భయాలు, అభద్రత వంటివి ఉన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ( Jairam Ramesh) ట్వీట్ చేశారు. మ్యూజియం పేరు నుంచి ఎన్ను తొలగించిన ప్రధాని మోడీ పీని చేర్చారని అన్నారు. స్వాతంత్రోద్యమంలో నెహ్రూ పాత్రను మోడీ తోసిపుచ్చలేరని, దేశ ప్రజాస్వామ్య, లౌకిక విలువల పటిష్టం కోసం, శాస్త్ర సాంకేతిక పురోగమనానికి నెహ్రూ అందించిన సేవలు ఎవరూ విస్మరించలేరని జైరాం రమేష్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ .. ఆయన భజనపరులు నెహ్రూ సేవలను తక్కువ చేసేందుకు చౌకబారు ప్రచారం సాగిస్తున్నారని మండిపడిన ఆయన.. అటువంటి వాటిని ప్రజలు నమ్మరని అన్నారు.