రాజకీయం, ప్రజాసేవలో ఉంటూ.. కళల పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తులు అరుదుగా ఉంటారని గ్లోబర్ స్టార్ రాంచరణ్ అన్నారు. అలాంటి అరుదైన, మంచి మనసున్న వ్యక్తి మన రాజ్య సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ అని రాంచరణ్ తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ తీసిన ఛాయాచిత్రాలతో కూడిన “వింగ్స్ ఆఫ్ పాషన్” అనే పుస్తకాన్ని ఇవాళ ( శనివారం ) తన నివాసంలో జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి రాంచరణ్ ఆవిష్కరించారు.
అనంతరం గ్లోబర్ స్టార్ రాంచరణ్ మాట్లాడుతూ.. “పక్షులతో ఉన్నప్పుడు నిశ్శబ్ధంగా ఉండమని” బుక్ లో వారు చెప్పిన మాట నా హృదయాన్ని హత్తుకుంది. జీవుల పట్ల ఎంతో కరుణా, జాలి, ప్రేమ, వాటితో నిరంతర సహవాసం ఉంటే తప్పా.. అద్భుతమైన ఆ తత్వాన్ని అర్ధం చేసుకోలేమని ఆయన పేర్కొన్నారు. పక్షులు, మూగజీవాలను అర్ధం చేసుకోవడానికి వారు ఎంత శ్రమించారో చెప్పడానికి ఆ ఒక్క మాట సరిపోతుంది. దేశంలో ఎందరో ఫోటోగ్రాఫర్లు ఉండొచ్చు కానీ.. రాజకీయ రంగం నుంచి వచ్చి ఇలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ లా ఫోటోలు తీసి.. వాటిని పుస్తకంగా తీసుకొచ్చిన నేత బహుశా జోగినపల్లి సంతోష్ కుమార్ ఒక్కరే కావచ్చు అని గ్లోబర్ స్టార్ రాంచరణ్ తన అభిప్రాయం తెలిపాడు.
కళ, కళ కోసం కాదు.. ప్రజల కోసం” అన్నారు మన పెద్దలు. సంతోష్ కుమార్ తన ఫోటోల ద్వారా పక్షులు, జంతువుల, వాటి ఆవాసాలు, వాటి జీవవైవిధ్యాన్ని తన ఫోటోల ద్వారా ఆవిష్కరిస్తూ.. తన కళను ప్రదర్శిస్తూ.. పక్షులు, మూగజీవాల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నారు. ఇది ఎంతో పరిణతితో కూడిన బాధ్యత అని రాంచరణ్ అన్నారు. అంతేకాదు, పక్షులకు దూరమైన మొక్కలు నాటిస్తున్నారు.. మరో పక్క వాటి పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ.. నిరంతరం ప్రకృతి సమతూల్యత కోసం పరితపిస్తున్నారు. నిజంగా జోగినపల్లి సంతోష్ కుమార్ కృషికి హ్యాట్సాఫ్ అంటూ ఆయన అభినందించారు.