Leading News Portal in Telugu

Rohit Sharma: తామేమీ పిచ్చోళ్లం కాదు.. అలా ఎందుకు చేస్తాం..!


టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో గత కొంత కాలంగా గందరగోళం ఏర్పడింది. అయితే, ఓపెనింగ్ జోడిగా రోహిత్-గిల్ వాళ్ల స్థానంలో బ్యాటింగ్‌ చేస్తారు.. ఇక నంబర్‌ 3లో విరాట్‌ కోహ్లీ ఫిక్స్‌.. కేఎల్‌ రాహుల్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌.. ఇప్పుడు ఆసియా కప్‌ టోర్నీలోనూ అదే చేస్తాడు. హార్దిక్‌ పాండ్యా ఆరో స్థానంలో వస్తాడు. ఏడో స్థానం రవీంద్ర జడేజా కోసం.. నంబర్‌ 4- 5 మధ్య కొన్నిసార్లు ఆటగాళ్ల బ్యాటింగ్ ఆర్డర్‌ మారుస్తామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. దాని వల్ల ఎలాంటి సమస్యా ఉండదు.. కానీ, చివరాఖరికి జట్టు సమతూకంగా ఉందా లేదా అన్నది మాకు ముఖ్యమని టీమిండియా సారథి రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు.

అయితే, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో పదే పదే ప్రయోగాలు చేయడానికి తామేమి పిచ్చోళ్లం కాదని విలేకరులకు రోహిత్ శర్మ కౌంటర్‌ ఇచ్చాడు. కాగా పాకిస్తాన్‌, శ్రీలంక వేదికలుగా ఆగష్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌-2023కి బీసీసీఐ నేడు (సోమవారం) జట్టును ప్రకటించింది. ఈ సందర్భంగా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో కలిసి రోహిత్‌ శర్మ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ క్రమంలో వెస్టిండీస్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగాల నేపథ్యంలో విలేకరులు హిట్‌మ్యాన్‌కు పలు ప్రశ్నలు అడిగారు.

సెప్టెంబరు 2న పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో టీమ్‌ కాంబినేషన్‌ ఎలా ఉండబోతుందని రిపోర్టర్స్ రోహిత్ శర్మను ప్రశ్నించారు. దీనికి రోహిత్ స్పందిస్తూ.. ఓపెనర్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడానికి తామేమీ పిచ్చోళ్లం కాదంటూ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. నేను వన్డే టీమ్ లోకి వచ్చినపుడు యంగ్ స్టార్ట్స్ కు ఫిక్స్‌డ్‌ బ్యాటింగ్‌ పొజిషన్‌ లేదు అని చెప్పాడు. నేను లోయర్‌ ఆర్డర్‌ నుంచే స్టార్ట్ చేశాను.. ఆ తర్వాత ఓపెనర్‌గా ప్రమోట్‌ అయ్యాను.. అంతేగానీ.. ఓపెనర్‌ను ఎనిమిదో స్థానంలో పంపడం.. ఎనిమిదో నంబర్‌ ప్లేయర్ ను ఓపెనర్‌గా పంపించడం లాంటి పిచ్చి పనులు చేయమని రోహిత్‌ శర్మ తెలిపాడు.

కాగా, విండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ తొలి వన్డేలో యంగ్ ప్లేయర్స్ ను రోహిత్ శర్మ ప్రమోట్‌ చేశాడు. తాను ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక, మిగిలిన రెండు వన్డేల్లో రోహిత్‌, కోహ్లి రెస్ట్ తీసుకోగా.. హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని టీమిండియా వెస్టిండీస్‌తో సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఆసియా కప్‌-2023నకు ముందు రోహిత్‌, కోహ్లీ లాంటి ప్రధాన ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగి కాస్త తడబడ్డా.. ఆపై నిలదొక్కుకోవడం యంగ్ టీమ్ లో ఆత్మస్థైర్యాన్ని నింపినట్లైంది.