అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ నుంచి సానుకూల సంకేతాల మధ్య, వారంలో మొదటి ట్రేడింగ్ రోజే ( సోమవారం ) స్టాక్ మార్కెట్ ఊపందుకుంది. రెండు బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో ముగిసాయి. బీఎస్ఈ సెన్సెక్స్ రోజు కనిష్ట స్థాయి నుంచి 260 పాయింట్లకు పైగా ఎగబాకింది. అదే టైంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ రోజు కనిష్ట స్థాయి నుంచి 80 పాయింట్లకు పైగా లాభపడింది. సెన్సెక్స్ 267 పాయింట్లు పెరిగి 65,216 పాయింట్ల దగ్గర మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి. ట్రేడింగ్ సమయంలో, సెన్సెక్స్ 65,335 డే హైకి వెళ్లింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచీ 19, 393 దగ్గర ముగిసింది. ట్రేడింగ్ టైంలో నిఫ్టీ 19, 425 పాయింట్ల వరకూ వెళ్లి 19,296 పాయింట్లను నమోదు చేసింది.
నిఫ్టీ గెయినర్స్ సూచీలో అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్ప్, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో ఇండస్ట్రీస్ ఉన్నాయి. టాప్ లూజర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బీపీసీఎల్ ఉన్నాయి. నేడు (సోమవారం) ట్రేడింగ్లో గ్రూప్ కంపెనీల అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్ షేర్లు 7 శాతానికి పైగా లాభాలను గడించాయి. ప్రమోటర్లు , విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు బహిరంగ మార్కెట్ ద్వారా ఈ కంపెనీలలో వాటాలను కొనుగోలు చేయడంతో.. గత మూడు రోజుల్లోనే అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ పవర్ షేర్లు 12 శాతం మేర ర్యాలీ చేశాయి.
అయితే, గత రోజుల మూడు రోజుల నుంచి ట్రేడింగ్ సెషన్లలో అదానీ పవర్ షేర్ 16 శాతం పెరిగింది. వాస్తవానికి, ఆస్ట్రేలియా-లిస్టెడ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ జీక్యూజీ పార్టనర్స్ బ్లాక్ డీల్స్ ద్వారా 8.1 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా అదానీ పవర్లో రూ. 9,000 కోట్లు పెట్టుబడులను పెట్టింది. అదనంగా, అదానీ పవర్ బిట్టా, ముంద్రా, కవై, తిరోడా, ఉడిపి, రాయ్పూర్, రాయ్గడ్లోని అనేక ప్రదేశాలలో 12,450 మెగావాట్ల సామర్థ్యాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో 40 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
ఇదిలా ఉండగా, నేడు (సోమవారం) బీఎస్ఈ సెన్సెక్స్లో అదానీ ఎనర్జీ షేరు 7.29 శాతం లేదా రూ.22.20 పెరిగి రూ.326.80 దగ్గర ముగిసింది. అదే సమయంలో, అదానీ పవర్ స్టాక్ కూడా జంప్ చేసి 7.32 శాతం లాభంతో రూ.326.90 దగ్గర ముగిసింది. అదే టైంలో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ స్టాక్ కూడా గ్రీన్లో ముగిసింది. ఇవాళ 2.31 శాతం నుంచి రూ.59.60 పెరిగి రూ.2,637 వద్ద స్టాక్ మార్కెట్స్ ముగిశాయి.