Leading News Portal in Telugu

Moon: ఇదేందయ్య ఇది.. ఏకంగా చంద్రుడిపై స్థలం కొని తల్లికి గిఫ్ట్‌ ఇచ్చిన కూతురు..


తనను అల్లారుముద్దుగా పెంచిన కన్న తల్లికి ఓ కూతురు వెరైటీ గిఫ్ట్ ఇచ్చింది. అయితే.. చిన్నప్పుడూ చందమామ రావే..జాబిల్లి రావే.. అంటూ తనను ఎత్తుకొని గోరుముద్దలు తినిపించిన అమ్మకి చందమామపైనే స్థలాన్ని కొని బహుమతిగా ఇచ్చింది. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెస్ కావాడంతో.. అదే రోజునే తన తల్లి పేరు మీద ఎకరం భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించింది.

అయితే, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీలో నివాసం ఉండే సింగరేణి కార్మికుడు సుద్దాల రాంచందర్‌, వకుళాదేవి దంపతులకు ఇద్దరు కూతుర్లు.. వీరిలో పెద్ద కూతురు సాయి విజ్ఞత ఉన్నత చదువులు చదివి యూఎస్ లో స్థిరపడింది. అక్కడి గవర్నర్‌ కిమ్‌ రెనాల్డ్స్‌లో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా వర్క్ చేస్తుంది. అమెరికా వెళ్లినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాతృ దినోత్సవం నాడు తన తల్లికి ఏదో ఒక గిఫ్ట్ పంపిస్తూ ఉండేది సాయి విజ్ఞత. కానీ, అది సాయి విజ్ఞతకు సంతృప్తిని ఇవ్వకపోవడంతో.. కన్న తల్లికి ఏదైనా అరుదైన కానుక ఇవ్వాలని అనుకుంది. ఇప్పటి వరకు ఎవ్వరూ ఇవ్వనటువంటి బహుమతిని ఇవ్వాలని అనుకుంటున్న టైంలో 2022లో చంద్రుడిపై స్థలాలను అమ్ముతున్నట్లు తెలుసుకుంది.

లూనార్‌ ల్యాండ్‌ రిజిస్ట్రీ అనే సంస్థ చంద్రుడిపై స్థలాలను అమ్మకానికి పెట్టడంతో వెబ్‌సైట్‌ను చూసిన సాయి విజ్ఞత తన తల్లి వకుళాదేవి, కుమార్తె ఆర్హ పేరు మీద ఒక ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం జూన్‌ 23న జాబిల్లిపై విక్రమ్‌ ల్యాండర్‌ సేఫ్‌గా దిగిన రోజునే చంద్రుడిపై స్థలం రిజిస్ట్రేషన్‌ అయింది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతరిక్షంలో కొనుగోలు చేసే భూములకు హక్కులు ఉంటాయా..? భవిష్యత్‌లో చంద్రుడి మీదకు మానవులు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుందా..? అలా ఇంకా ఎన్నేళ్లు పడుతుంది..?అన్న అనుమానాలు అడుగుతున్నారు.