ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని 17 ప్రాంతాలను నిషేదిత జాబితా నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో వాటర్ కోర్స్ పోరంబోకు స్థలాలుగా పరిగణిస్తూ నగరపాలక సంస్థ పరిధిలోని తంబువాని గుంట, కొర్లగుంట, కొత్తపల్లి, చంద్రశేఖర్ రెడ్డి కాలనీ, ఎరుకల కాలనీ, జర్నలిస్ట్ కాలనీ ,కెనడి నగర్, భగత్ సింగ్ కాలనీ , సుందరయ్య నగర్, శారదా నగర్, సూరయ్య కట్ట, చెన్నారెడ్డి కాలనీ, సంజీవయ్య నగర్, సింగాల గుంట, నరసింహ తీర్థం రోడ్డు, తాతయ్య గుంట, బొమ్మగుంట ప్రాంతాల్లోని స్థలాలను నిషేధిత జాబితా 22(ఎ) లో చేర్చారు.
దీంతో తిరుపతి అర్బన్ పరిధిలోని 17 ప్రాంతాల్లోని 104 ఎకరాల పరిధిలో. 5 వేల నివాసాలకు పైగా తీవ్ర ప్రభావం పడింది. ఇవేవీ 60 ఏళ్లకు పైగా రిజిస్ట్రేషన్ సౌకర్యానికి నోచుకోలేదు. దీంతో కళ్ల ముందే ఆస్తులున్నా అవసరానికి వాడుకోలేని దయనీయ స్థితి. తమ స్థలాలను రెగ్యులరైజ్ చేయించాలని కొన్నేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ 17 ప్రాంతాల్లోని ప్రజలు కాళ్లరిగేలా తిరుతున్నారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంలో తిరుపతిలో వైసీపీ తరపున బరిలో నిలిచిన భూమన కరుణాకరరెడ్డి నీటి ఆవాసానికి ఏ మాత్రం అవకాశం లేని జనాలతో నిండిన ప్రాంతాలకు విముక్తి కల్పిస్తానని హామీ ఇచ్చారు. తిరుపతిలో లోకల్ బాడీ కొలువుతీరిన వెంటనే భూమన అభినయ్ రెడ్డి ఈ భూముల అంశాన్ని లేవనెత్తి, సమస్య పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తీర్మానించారు. ఈ విషయమై సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ప్రబుత్వం 104 ఎకరాల భూమి రెగ్యులరైజ్కు నోచుకుంది.