Leading News Portal in Telugu

AI to Everyone: ఇండియాను చులకనగా మాట్లాడిన ఏఐ రూపకర్త.. ముఖేష్ అంబానీ కీలక నిర్ణయం


Mukesh Ambani Promises AI to Everyone: చాట్ జీపీటీ ఏఐ వ్యవస్థను రూపొందించడానికి భారతీయులు ప్రయత్నించవచ్చు కానీ అది వేస్ట్ అవుతుంది అంటూ వ్యాఖ్యానించాడు ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సీఈవో సామ్ ఆల్ట్ మాన్. చాట్ జీపీటీ రూపకల్పనలో ఆల్ట్ మాన్ కీలక పాత్ర పోషించారు. ఇక రెండు నెలల క్రితం భారత్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలను భారత వ్యాపార దిగ్గజం, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ చాలా తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. సామ్ ఆల్ట్ మాన్ కు దిమ్మతిరిగే ఓ విషయాన్ని ప్రకటించారు ముఖేష్ అంబానీ.

సోమవారం రిలయన్స్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. చాట్ జీపీటీ తరహాలో భారతీయుల కోసం జియో సంస్థ కొత్త ఏఐ సిస్టమ్‌లను రూపొందిస్తుందన్నారు. ఏఐలో రాణించటానికి అవసరమైన వనరులు, నిబద్ధత భారత్ సొంతమని అన్నారు. ఏడేళ్ల క్రితం ఇండియాలో ప్రతి ఇండియాలో ప్రతి ఇంటికి బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిస్తామని మాట ఇచ్చాం దానిని చేసి చూపించాం. రాబోయే కొన్ని రోజుల్లో భారతీయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ అందిస్తాం. ప్రతి ఒక్కరికి, ప్రతి చోట జియో ఏఐని అందిస్తామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాట ఇచ్చారు.

దీని కోసం అవసరమైన అన్ని వనరులను సమకూర్చకుంటున్నామని ఈ వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకుంటామని అంబానీ తెలిపారు. దీనితో సామ్ ఆల్ట్ మాన్ కు గట్టి కౌంటర్ ఇచ్చినట్లు అయ్యింది. ప్రపంచంలోని అన్ని పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఇండియన్స్ టాలెంట్ గురించి సామ్ ఆల్ట్ మాన్ మాట్లాడటం చర్చనీయాంశం అయ్యింది. ఇక దేశంలో 5 జీ సేవలను కూడా అన్ని చోట్ల పూర్తిగా అందుబాటులోకి తెస్తామని ముఖేష్ అంబానీ ఈ సమావేశం సందర్భంగా వెల్లడించారు. ఇక రిలయన్స్ జియో వచ్చిన తరువాతే దేశంలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ సదుపాయం  అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. చౌక ధరలకే నెట్ సేవలు అందించిన ఘనత రిలయన్స్ జియోకే దక్కుతుంది.