Leading News Portal in Telugu

Amaravati Assigned Lands Case: అమరావతి భూములపై సీఐడీ కేసు.. తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు


Amaravati Assigned Lands Case: అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ కేసులపై తీర్పు రిజర్వ్ చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. అసైన్డ్ భూముల్లో అవకతవకలకు పాల్పడ్డారని చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం విదితమే కాగా.. సీఐడీ కేసులపై గతంలోనే స్టే ఇచ్చింది ఏపీ హైకోర్టు.. తుది విచారణలో భాగంగా ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు.. ఈ రోజు తీర్పు రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది..

కాగా, అమరావతి అసైన్డ్ భూముల కొనుగోళ్లపై చంద్రబాబు, నారాయణపై నమోదైన సీఐడీ కేసులపై ఏపీ హైకోర్టులో తుది విచారణ సందర్భంగా గతంలో కీలక వాదనలు జరిగాయి.. కేవలం అమరావతిలో ఎస్సీల దగ్గర ఉన్న భూములను తక్కువకు బినామీలతో నారాయణ కొనుగోలు చేయించారని సీఐడీ పేర్కొంది. వీటికి రక్షణ కల్పించేందుకు కేబినెట్ ఆమోదం లేకుండా జీవో 41 తీసుకువచ్చారని కోర్టులో వాదనలు వినిపించింది. ఎస్సీల నుంచి భూములు బినామీలు కొని వారే హక్కుదారుగా చూపించాలనే కుట్రతో జీవో 41 తీసుకొచ్చారని సీఐడీ తెలిపింది. అసైన్డ్ భూముల విషయంలో బాధితులు ఎస్సీలు అని, వారి స్టేట్‌మెంట్‌ను సీల్డ్ కవర్‌లో కోర్టుకు అందజేసింది. ఈ కేసులో బినామీల ద్వారా కొనుగోలు చేసిన అసైన్డ్ భూముల విలువ అప్పట్లో 18 కోట్లు ఉంటే ఇప్పుడు అది 600 కోట్ల రూపాయలుగా ఉందని సీఐడీ.. గతంలోనే కోర్టు దృష్టికి తీసుకెళ్లిన విషయం విదితమే.

మరోవైపు.. చంద్రబాబు అండగా ఉన్నారనే మంత్రిగా నారాయణ ఈ బినామీ లావాదేవీలు నిర్వహించారని కూడా గతంతో కోర్టుకు విన్నవించింది సీఐడీ.. ఆరోపించింది. సీఐడీ సీజ్ చేసిన ఫోన్స్‌లో మంత్రి నారాయణ, ఆయన కుమార్తె సింధూర మాట్లాడుకున్న కాల్ రికార్డ్ గుర్తించినట్టు సీఐడీ చెప్పింది. నారాయణ, ఆయన కుమార్తె సంభాషణ కాల్ రికార్డ్‌ను పెన్ డ్రైవ్‌లో వేసి న్యాయమూర్తికి అందజేసింది. అసైన్డ్ భూముల విషయంలో అప్పటి గుంటూరు కలెక్టర్ కాంతి లాల్ దిండే, జేసీ చెరుకూరి శ్రీధర్ ఇబ్బందులు వస్తాయని చెప్పినా మంత్రి నారాయణ పట్టించుకోలేదని కోర్టుకు సీఐడీ తెలిపింది. ఎఫ్‌ఐఆర్‌ల మీద స్టే ఉంటే ఏ విధంగా విచారణ చేశారని పిటిషనర్ ప్రశ్నించగా.. అసైన్డ్ భూములకు సంబంధించి దాఖలైన వేరే కేసుల్లో సీఐడీ విచారణ చేయగా ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయని సీఐడీ చెప్పింది. అయితే, తుది విచారణలో భాగంగా ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు.. ఈ రోజు తీర్పు రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.