Leading News Portal in Telugu

Aditya L1 mission: ఇక సూర్యుడిపై ఫోకస్‌ పెట్టిన ఇస్రో.. నేడే PSLV C-57 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌


Aditya L1 mission: చంద్రయాన్‌-3తో జాబిలమ్మపై అడుగుపెట్టి అక్కడి పరిస్థితులు, వనరులపై అధ్యయనం మొదలుపెట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో).. చందమామపై ఉన్న రహస్యాలను ఛేదించే పనిలోపడిపోయింది.. మరోవైపు.. ఇప్పుడు సూర్యుడిపై ఫోకస్‌ పెట్టింది.. దీనికి సంబంధించిన PSLVC-57 రాకెట్ ప్రయోగానికి ఈ రోజు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.. ఈ రోజు ఉదయం 11.50 గంటలకు మొదలుకానున్న కౌంట్ డౌన్.. 24 గంటల పాటు కొనసాగనుంది.. ఆ తర్వాత PSLVC-57 రాకెట్ ను ప్రయోగించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు..

ఇప్పటికే PSLVC-57 ప్రయోగానికి లాంచ్ అథరైజేషన్ బోర్డు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది.. మరోవైపు.. శ్రీహరికోటకు చేరుకున్నారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.. ప్రయోగ ప్రక్రియపై శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు.. రాకెట్ లోని వివిధ విభాగాలను పరిశీలిస్తున్నారు శాస్త్రవేత్తలు.. ఈ ప్రయోగం ద్వారా సూర్యుడి పై పరిశోధనలకు ఆదిత్య- L1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నారు.. ఇక, నిన్న షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్‌ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డుకు అప్పగించారు. ల్యాబ్‌ చైర్మన్‌ రాజరాజన్‌ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటన చేశారు..

అయితే, చందమామ చల్లనివాడు.. సూర్యుడు మండే అగ్నిగోళం.. చందమామ విక్రంల్యాండర్‌ ల్యాండ్‌ అయ్యింది.. పనికూడా ప్రారంభించింది.. ఎప్పటికప్పుడు.. సూర్యుడికి సంబంధించిన ఫొటోలను ఇస్రో విడుదల చేస్తూనే ఉంది.. మరి ఆదిత్య-ఎల్1 ప్రయోగం ఎలా ఉండబోతోంది అనే చర్చ ఆసక్తికరంగా సాగుతోంది.. అయితే, వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్‌ బిందువు–1(ఎల్‌–1) చుట్టూ ఉన్న కక్ష్య వరకే సాగనుంది.. ఆ కక్ష్యలో ఆదిత్య–ఎల్‌1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది ఇస్రో.. దీని ద్వారా గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై అధ్యయనం చేయబోతున్నారు.. అయితే, ఆదిత్య-ఎల్1.. ఆ కక్ష్యకు చేరుకోవడానికే 175 రోజుల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నమాట.