Leading News Portal in Telugu

Income Tax Notice To Chandrababu: చంద్రబాబుకు ఐటీ నోటీసులు


Income Tax Notice To Chandrababu: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకి ఆదాయ పన్ను శాఖ(ఐటీ) షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అమరావతి కాంట్రాక్టర్లు అయినషాపూర్జీ పల్లోంజీ (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు 118 కోట్ల రూపాయాలు ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.. అయితే, ఈ క్రమంలో షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్లు సమాచారం అందుతోంది.. బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు.. మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో అసలు విషయం బయటపడిందని.. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ (ఎంవీపీ) ఒప్పుకున్నారని తెలుస్తోంది..

ఇక, చంద్రబాబు అభ్యంతరాలను తిరస్కరించిన తర్వాత.. ఆగస్టు 4వ తేదీనే హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సంస్థల నుంచి వచ్చిన రూ.118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించడం, చట్టం ప్రకారం ప్రాసెస్ చేయబడుతుందనే అంశాలను నోటీసుల్లో ప్రస్తావించింది ఐటీ శాఖ. షాపూర్జీ పల్లోంజీ (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా ముడుపులు ముట్టాయని.. ఫోనిక్స్ ఇన్ఫ్రా & పౌర్ ట్రేడింగ్ అనే సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగినట్లు తేలిందంటున్నారు. 2016లో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా టచ్‌లోకి వెళ్లాడట మనోజ్ వాసుదేవ్. శ్రీనివాస్ ద్వారానే సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి చంద్రబాబు ముడుపులు అందుకున్నారని అభియోగాలున్నాయి.. ఇక, చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసుల విషయాన్ని.. ఓ జాతీయ పత్రిక బయటపెట్టింది. అయితే, చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసుల వ్యవహారం ఇప్పుడు కలకలం రేగుతోంది.. దీనిపై టీడీపీ లేదా చంద్రబాబు కార్యాలయం స్పందించాల్సి ఉంది.