Pawan Kalyan: ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ వైపు అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం.. ఎప్పటి నుంచో ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ విధానంపై చర్చ నడుస్తుండగా.. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాత్రం వడివడిగా అటువైపు అడుగులు పడుతున్నాయి.. “ఒక దేశం-ఒకే ఎన్నిక”పై మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు.. 16 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.. అన్ని అంశాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులను చేయనుంది ఆ కమిటీ.. ఇక, ఎన్డీఏ భాగస్వామ పక్షంగా ఉన్న జనసేన పార్టీ ఈ విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది.. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ విధానానికి జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్.. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల ఎన్నో సానుకూలతలు ఉన్నాయన్న ఆయన.. వేల కోట్ల ప్రజాధనం వృథాకు అడ్డుకట్ట పడుతుందన్నారు. భద్రతా బలగాలు దేశ రక్షణపైనే దృష్టి నిలుపుతాయి.. రాజ్యాంగ దినోత్సవం అయిన నవంబర్ 26న ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ దేశమంతటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ఆలోచన చేస్తున్నామని, దీనిపై ప్రజలు కూడా చర్చించాలని పేర్కొన్నారు. అప్పటి నుంచి జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చిందని గుర్తుచేశారు.
ఇక, జమిలి ఎన్నికలు దేశానికి కొత్తకాదన్నారు పవన్ కల్యాణ్.. స్వాతంత్ర్యానంతరం 1952, 1957, 1962, 1967 సంవత్సరాల్లో దేశమంతటికీ ఒకేసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయన్న ఆయన.. తరువాత రాజకీయ పరిణామాల క్రమంలో ఈ సంప్రదాయం కొనసాగించలేకపోయారు. దీనివల్ల దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరగడం నిత్యకృత్యంగా మారిపోయింది. దీంతో ఎన్నికల నిర్వహణపైనే ప్రభుత్వాలు, పాలకులు దృష్టి నిలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశాన్ని పట్టిపీడిస్తున్న పేదరికం, నిరుద్యోగంలాంటి అంశాలతోపాటు ఆర్థిక అభివృద్ధి, విద్యావ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం వంటి విషయాలపై దృష్టి నిలిపేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల దృష్టి ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల మీదనే ఉండిపోవడంతో ప్రజా ఉన్నతికి సంబంధించిన అంశాలపై చర్చ జరగకుండా పక్కదారి పట్టడానికి ఇదో కారణంగా నిలిచిందని.. దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రజల చర్చ పూర్తిగా దేశాభివృద్ధి గురించే జరుగుతుందన్నారు.
దేశ అంతర్గత రక్షణ చూడాల్సిన కేంద్ర భద్రతా బలగాలు నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఎన్నికల విధుల్లోనే ఉండిపోతున్నాయన్నారు పవన్ కల్యాణ్.. ఒకేసారి ఎన్నికలు జరగడం ద్వారా భద్రతా బలగాలకు విలువైన సమయం ఆదా కావడంతోపాటు దేశ భద్రతపై మరింత దృష్టి పెట్టడానికి వీలు కలుగుతుందన్నారు. వలస కార్మికులు ప్రతీసారి ఎన్నికలు జరుగుతుంటే ఎన్నో ఇబ్బందులుపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే అంతరాష్ట్ర వలస కార్మికులకు ఇబ్బందులు తప్పుతాయన్నారు. రాష్ట్రాల శాసనసభలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిగితే చాలా సమయం, ప్రజాధనం కూడా ఆదా అవుతుంది. ప్రతిసారీ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులను బట్టి మతం, కులం వంటి ఇతర విషయాలపై దేశమంతటా చర్చ జరుగుతోంది. ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఇలాంటి చర్చలు ఒకసారే జరిగి మిగిలిన సమయం దేశం ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉందన్నారు. ఎన్నికల ఖర్చు ప్రతీ ఐదేళ్లకు గణనీయంగా పెరిగిపోతోంది. 1951-52 ఎన్నికలు కేవలం రూ. 11 కోట్ల ఖర్చుతో నిర్వహిస్తే ఆ భారం 2014 వచ్చేసరికి రూ. 30 వేల కోట్లకు చేరిందని గుర్తుచేశారు.. అదే 2019 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి రూ. 60 వేల కోట్లకు చేరిందని.. దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిగితే అదే ఖర్చుతో రాష్ట్రాల శాసన సభలకు, లోక్ సభకు పాలన వ్యవస్థను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలా వరకు ప్రజాధనం వృథా కాకుండా ఉంటుందన్నారు.
నల్లధనం, ఎన్నికల అవినీతిని అరికట్టడానికి కూడా వన్ నేషన్ – వన్ ఎలక్షన్ దోహద పడుతుందన్నారు పవన్ కల్యాణ్.. 1983లో లోక్ సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. 1999లో లా కమిషన్ ఛైర్మన్ గా ఉన్న జస్టిస్ బి.పి. జీవన్ రెడ్డి తన నివేదికలో కూడా దేశానికి ఒకేసారి ఎన్నికలు జరగడం సముచితంగా ఉంటుందని తన నిర్ణయాన్ని చెప్పారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయం దేశానికి ఎంతో అవసరం. ఎన్నికల ఖర్చు తగ్గడం, నల్లధనం లేకుండా ఎన్నికల జరగడం, కులం, మతం వ్యవహారాలు పదే పదే చర్చకు రాకుండా ఆగుతున్నాయి. భద్రత బలగాలకు దేశ రక్షణలో నిమగ్నం కావడం వంటి ఎన్నో సానుకూలతలు ఉన్నాయి. ఇలాంటి విషయాలపై ఆలోచించి జనసేన పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.