Leading News Portal in Telugu

YS Rajasekhara Reddy: వైఎస్‌కు గవర్నర్‌ నివాళి.. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు


YS Rajasekhara Reddy: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నా నివాళులు.. దార్శనికత ఉన్న నాయకుడు వైఎస్ఆర్ అంటూ కొనియాడారు గవర్నర్‌.. రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేసిన వ్యక్తి వైఎస్సార్ అని పేర్కొన్న ఆయన.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. ఇక, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిలిచిపోయారని సోషల్‌ మీడియా వేదికగా వరుస ట్వీట్లు చేశారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌.

మహానేత డాక్టర్ వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నేడు. సంక్షేమానికి కొత్త భాష్యం చెబుతూ.. అభివృద్ధిని పరుగులు పెట్టించిన నేత ఆయన.. ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా.. ఇవ్వని హామీలను కూడా ప్రజలకు అందించిన గొప్ప నేత. జయమ్మ, రాజారెడ్డి దంపతులకు 1949 జూలై 8న కడప జిల్లా, జమ్మలమడుగులోని సీఎస్‌ఐ కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించిన వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి.. విద్యార్థి దశ నుంచే రాజకీయాలవైపు అడుగులు వేశారు.. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో కింది స్థాయి నుంచి సీఎం వరకు అనేక పదవులు ఆయన నిర్వహించారు.. ఎంపీలు, ఎమ్మెల్యేగా.. ముఖ్యమంత్రిగా ఆయన సేవలు మరువలేనివి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ వరుస ఓటముల సమయంలో మండుటెండను సైతం లెక్కచేయకుండా చేవేళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ప్రజా ప్రస్థానం పేరుతో 1475 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది.. అయితే, 2009 సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయన నేలకొరిగారు.. ఆ మహానేత తమకు లేడని తెలిసి ఎన్నో గుండెలు ఆగాయి.. అంతలా ఆయన ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పటికీ ఆ మహా నేతను తలచుకుంటూనే ఉన్నారు.