జగన్కు ఎక్కుపెట్టిన బాణమా.. జగన్ వదిలిన బాణమా!? | sharmila compramise with jagan| dk| stalin| mediate| merger| congress
posted on Sep 5, 2023 4:34PM
వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల తన వైఎస్ఆర్టీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం ఖాయమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల ఏపీకి వెళ్తారా?, తెలంగాణలోనే రాజకీయం చేస్తారా? తెలంగాణలోనే షర్మిల రాజకీయాలంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒప్పుకుంటారా? అసలు షర్మిల అన్నతో విభేదిస్తే పార్టీ పెట్టాల్సింది ఏపీలోనే కదా.. మరి తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టారు? ఇప్పుడు తెలంగాణలో ఆమెకి ప్రోత్సాహకం, ఆదరణ లేక కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నప్పుడు మళ్ళీ ఆమె తెలంగాణ రాజకీయాలలోనే ఉండడం ఎందుకు? ఏపీకి చెందిన వైఎస్ఆర్ కుమార్తె, ఏపీ సీఎంకు సొంత సోదరి తెలంగాణ రాజకీయాలలోనే ఉండాలని పట్టుబట్టడం వెనక మతలబు ఏంటి? కాంగ్రెస్ పెద్దలు ఏపీకి వెళ్ళమంటే షర్మిల ఎందుకు ఇష్టపడడం లేదు? షర్మిల ఏపీలోకి వద్దని వైసీపీ పెద్దలే బెదిరిస్తున్నారా? లేక విభేధాలున్నా అన్న మీద మమకారంతోనే షర్మిల ఏపీకి వెళ్లేందుకు ఇష్టపడడం లేదా? గత మూడు నెలల నుండి ఇలా ఎన్నో విశ్లేషణలు సాగిపోతున్న సంగతి తెలిసిందే.
షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం ఖరారు కాగా ప్రస్తుతానికి అయితే దాదాపుగా ఆమె తెలంగాణ రాజకీయలకి పరిమితం కానున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో కర్ణాటక నుండి షర్మిలను రాజ్యసభకు పంపడం కూడా ఖాయమేనని రాజకీయ వర్గాలు బలంగా చెప్తున్నాయి. అయితే, ఆమె ఏపీకి వెళ్ళమన్నా వెళ్లకుండా.. కాంగ్రెస్ లో విలీనానికి మొగ్గు చూపడం వెనక ఇప్పుడు కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్ లోకి చేరి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకుంటే వైసీపీకి భారీ నష్టం తప్పదని ఇప్పటి వరకూ విశ్లేషణలు సాగిన సంగతి తెలిసిందే. షర్మిల కాంగ్రెస్ లో ఉంటే వైసీపీలోని పాత కాంగ్రెస్ నేతలు కొందరు తిరిగి సొంత గూటికి వస్తారని, వైసీపీ క్యాడర్ లో అసంతృప్తులు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని.. తద్వారా ఏపీలో వైసీపీ ఐదు నుండి పది శాతం ఓటు బ్యాంకు నష్టపోవాల్సి వస్తుందని అంచనా విశ్లేషణలు సాగాయి.
కాగా, ఇప్పుడు అసలు షర్మిల జగనన్న వదిలిన బాణంగానే కాంగ్రెస్ లోకి చేరారా.. అన్నకు మేలు చేసేందుకే షర్మిల కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారా? వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్న ఓటర్లు ప్రతిపక్షాల వైపు వెళ్లకుండా తన వైపుకు తిప్పుకోనేందుకే షర్మిల కాంగ్రెస్ పల్లకి ఎత్తుకున్నారా అనే అనుమానాలు మొదలవుతున్నాయి. అన్నతో విభేదాలున్నాయని, అందుకే షర్మిల కొత్త పార్టీ పెట్టుకున్నారని అందరూ చెప్పుకొన్నదే. తల్లి విజయమ్మ కూడా కుమారుడు జగన్ చేసిన అన్యాయాన్ని సహించలేకనే వైసీపీకి రాజీనామా చేసి షర్మిలతో ఉంటున్నారని కూడా రాజకీయ వర్గాలలో పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఇంత జరుగుతున్నా షర్మిల ఇప్పటి వరకు అన్న జగన్ ను ఒక్క మాట అన్న దాఖలాలు లేవు. నేరుగా జగన్ ను విమర్శించిన దాఖలాలూ లేవు. దీంతో షర్మిల రాజకీయాలు కూడా అన్న జగన్ వ్యూహాలలో భాగమేనా అన్న కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకూ కేంద్రంలో బీజేపీతో తెరవెనక మైత్రి సాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఏపీలో పొత్తులు ఖరారైతే బీజేపీతో వైసీపీ స్నేహం వదులుకోవాల్సిందే. మరోవైపు కేంద్రంలో అసలు బీజేపీ ప్రభుత్వం వస్తుందా లేదా అన్న అనుమనాలు కూడా రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి రోజురోజుకూ పుంజుకుంటున్నదని పరిశీలకులు విశ్లేషణలతో సహా చెబుతున్నారు. ఒకవేళ కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే కాంగ్రెస్ నుండి గత జ్ఞాపకాల వేధింపులు మళ్ళీ పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలో చెల్లి షర్మిల కాంగ్రెస్ లో ఉంటే కేంద్రంలో ఇండియా కూటమి వచ్చినా జగన్ మోహన్ రెడ్డికి అండా దండా దొరకడం ఖాయం. ఈ వ్యూహాలతోనే షర్మిల జగనన్న వదిలిన బాణంగానే కాంగ్రెస్ పంచన చేరారా అన్న అనుమానాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. మరి ఇందులో ఏది వాస్తవమో? ఏది ఎవరి వ్యూహమో? ఎవరు ఎవరికి శత్రువులో? ఎవరు ఎవరి పక్షాన ఉన్నారో ముందుముందు చూడాల్సి ఉంది.
ఇలా ఉండగా.. ఏపీ సీఎం జగన్.. ఆయన సోదరి షర్మిల మధ్య ఏమైనా విభేదాలు ఉంటే గింటే అవి వారి తండ్రి వైఎస్ ఆస్తుల విషయంలోనేనని వైఎస్ కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారిరువురి మధ్యా సయోధ్య కుదిర్చేందుకు కాంగ్రెస్ నాయకుడు, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రంగంలోకి దిగారని చెబుతున్నారు. ఏపీ సీఎం జగన్ తరఫున తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, షర్మిల తరఫున డీకే శివకుమార్ లు రంగంలోకి దిగి వారిరువురి మధ్యా రాజీ కుదిర్చారని రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణలో ఉన్న భూములు, అలాగే నగదు పంపిణీల విషయంలో ఇరువురి మధ్యా రాజీ కుదిరిందనీ, ఈ డీల్ పట్ల షర్మిల సంతృప్తి వ్యక్తం చేశారనీ కూడా అంటున్నారు. దీంతో షర్మిల తన పార్టీ వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినా ఆమె తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు దూరంగా ఉండేలా డీల్ కుదిరిందని చెబుతున్నారు.
అంటే షర్మిలకు కాంగ్రెస్ లో కీలక పదవి ఇచ్చి సముచిత స్థానం ఇస్తారనీ, అయితే ఆమె కోరుకున్నట్లుగా తెలంగాణ రాజకీయాలలో చురుకుగా ఉండే అవకాశం ఉండదనీ, అలాగే ఆమె డిమాండ్ చేస్తున్న విధంగా పాలేరులో పోటీకి అవకాశం ఉండదనీ చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ లో ఆమె పోషించే పాత్ర రెండు తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.