Leading News Portal in Telugu

Lagadapati Rajagopal: ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ రీఎంట్రీ..! అక్కడి నుంచే ఎన్నికల బరిలోకి..?


Lagadapati Rajagopal: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు ప్రత్యేక స్థానం ఉంది.. రాష్ట్ర విభజన సమయంలో ఆయన స్టేట్‌మెంట్లు ఇవ్వడమే కాదు.. పార్లమెంట్‌ వేదికగా చేసిన హంగామా ఎవరూ మర్చిపోలేనిది. ఇక, రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నానని ప్రకటించిన ఆయన.. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇదే సమయంలో.. సర్వేలు నిర్వహించారు.. కొన్నిసార్లు ఆయన సర్వే ఫలితాలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి.. గత ఎన్నికల్లో అది కూడా రివర్స్‌ కావడంతో ఆ తర్వాత సైలెంట్‌ అయిపోయారు. వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. అయితే, ఇప్పుడు లగడపాటి రాజగోపాల్‌ రీ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.. వరుస సమావేశాలే కాదు.. వచ్చే ఎన్నికల్లో బరిలో దిగే అవకాశం కూడా ఉందనే ప్రచారం సాగుతోంది.

ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పొలిటికల్‌ రీఎంట్రీ కోసం విజయవాడలో ఆయన అనుచ‌రులు స‌న్నాహక సమావేశం నిర్వహించనున్నారట. రాజగోపాల్ తిరిగి రాజకీయాల్లోకి రావాలని పట్టుబడుతోంది ఆయన వర్గం.. ఈ నెలాఖరులో అనుచరుల ఆత్మీయ సమావేశంలో రాజగోపాల్ పాల్గొనబోతున్నారని టాక్‌ నడుస్తోంది. విజయవాడ సిటీలోని ఓ హోట‌ల్ లో నిన్న రహస్యంగా భేటీ అయ్యారట ల‌గ‌డ‌పాటి అనుచ‌రులు. విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి ఆయనకు ఇష్టమైన పార్టీ నుంచి బరిలోకి దిగాలని అనుచరులు కోరుతున్నారట.. రాష్ట్రవిభ‌జ‌నకు వ్యతిరేకంగా పొలిటిక‌ల్ కెరీర్‌కు స్వస్తి పలికిన లగడపాటి రాజ‌గోపాల్.. రీ ఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక, విజ‌య‌వాడ పార్లమెంట్ ప‌రిధిలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో త్వర‌లో స‌మావేశాలు నిర్వహించే విషయంపై అనుచరులతో జరిగే సమావేశంలో లగడపాటి రాజగోపాల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అనుచ‌రుల కోరిక‌ను ల‌గ‌డ‌పాటి నెర‌వేరుస్తారా? లేదా? అనీ పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. మొత్తంగా ఆంధ్రా ఆక్టోపస్‌గా ప్రసిద్ధి చెందిన లగడపాటి రాజగోపాల్‌ మళ్లీ విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేయించాలన్న ఉద్దేశంతో ఆయన అనుచరులు రహస్యంగా సమాలోచనలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.