Leading News Portal in Telugu

TS TET : రెండు రోజుల్లో తెలంగాణ టెట్ హాల్ టికెట్స్ విడుదల..


తెలంగాణ రాష్ట్రం లో ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ మొదలు పెట్టింది. దాదాపు అన్నీ శాఖలలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియ పూర్తి చేసింది.ఇక మిగిలింది టీచర్ ఉద్యోగాల భర్తీ మాత్రమే. తాజాగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రాష్ట్రం లో ఖాళీగా వున్నా టీచర్ ఉద్యోగాల భర్తీకి మరో రెండు రోజుల్లో పూర్తి విధి విధానాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. టీచర్ ఉద్యోగాల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 1 వ తేదీన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 15 న పరీక్షను నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో ప్రకటించింది. దీనితో తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) 2023 రాత పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లు మరో రెండు రోజుల్లో విడుదల కానున్నాయి.తెలంగాణ టెట్‌ 2023 హాల్‌ టికెట్లు సెప్టెంబర్‌ 9వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని టెట్‌ కన్వీనర్‌ రాధారెడ్డి తాజాగా ప్రకటనలో వెల్లడించారు.

టెట్‌ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు సెప్టెంబర్ 9 నుంచి 14వ తేదీ వరకు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తాజా ప్రకటనలో వివరించారు. ఇక టెట్‌ పరీక్ష సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించనున్న విషయం తెలిసిందే. పేపర్‌ 1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. పేపర్‌-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.కాగా టెట్‌ పరీక్ష ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటలతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు పేపర్‌-1, పేపర్‌-2కు కలిపి మొత్తం 4.78 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిల్లో పేపర్‌-1 పరీక్షకు 2,69,557 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్‌-2కు 2,08,498 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లకు కలిపి 1,86,997 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,91,058 మంది అభ్యర్థులు టెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.కాగా 2022లో నిర్వహించిన టెట్‌ పరీక్షకు 6.28 లక్షల దరఖాస్తులు వరకు వచ్చాయి. ఈసారి ఆ సంఖ్య లక్షన్నరకు తగ్గింది. కేవలం 4.78 లక్షల దరఖాస్తులు మాత్రమే అందాయి. ఇక టెట్‌ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష తేదీల్లో సెప్టెంబరు 15న నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తోంది. టెట్‌ పరీక్ష అనంతరం సెప్టెంబర్‌ 27న ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది