గనులు,భూగర్భ వనరుల శాఖపై ఉన్నతాధికారులతో సచివాలయంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డికి రాష్ట్రంలో 2014 ఆర్ధిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు శాఖ సాధించిన విజయాలను అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గనుల శాఖ దేశంలోనే అద్వితీయ ప్రగతి సాధించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రజానికానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి అవసరమైన ఇసుకను సరసమైన ధరలకు అందించాలని అధికారులకు సూచించారని, గనుల శాఖలో ఖాళీగా ఉన్న 127 అధికారులు, సిబ్బందిని భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దృష్టికి ఈ విషయాన్ని తెలియపరుస్తామని ఆయన అన్నారు.
సాంకేతికను అనుసంధం చేసి గనులు, భూగర్భ వనరుల శాఖను బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని ఆయన వెల్లడించారు. గనుల నిర్వహణలో పారదర్శకత కోసం ఇసుకను ఆన్లైన్ విధానం ద్వారా అమ్మేందుకు పటిష్టమైన ఏర్పాట్లు ఉన్నాయని, టీఎస్ఎండీసీ సంస్థ దేశంలో పలు అవార్డులను తెచ్చుకోవడం అభినందనీయమని ఆయన వ్యాఖ్యానించారు. గత ఏడేళ్ల కాలంలో రూ.5,444 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి సమకూర్చిందని తెలిపారని, రాష్ట్రంలో 101 ఇసుక రీచ్ ల ద్వారా ఇసుకను సరఫరా చేస్తున్నామని, 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్రమ నివారణను అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. పట్టా భూముల్లో ఉన్న ఇసుక తదితరాల కు అనుమతులు వేగవంతం చేసేందుకు అన్ని జిల్లా కలెక్టర్లకు లేఖలు వ్రాయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.