Leading News Portal in Telugu

RishiSunak: అక్షరధామ్ టెంపుల్ ను దర్శించుకున్న ఆ దేశ ప్రధాని, ఆయన భార్య


Britian Prime Minister RishiSunak Visited Akshardham Temple With His Wife Akshara Murty: జీ-20 సమావేశాల కోసం వివిధ దేశాల నేతలు భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సదస్సు కోసం భారత్ వచ్చిన వారిలో ఒకరైన బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ భారత్ ను పొగడ్తలతో ముంచెత్తిన విషయం విదితమే.ఆయన భారతదేశం ఎంతో గొప్పదని పేర్కొనడమే కాకుండా తనకు ఎంతో ఇష్టమైన దేశమని వెల్లడించారు. ఇక ఆయన బ్రిటన్ ప్రధాని అయిన తరువాత ఆ హోదాలో భారత్ ను సందర్శించడం ఇదే తొలిసారి. తన భార్య అక్షరామూర్తితో కలిసి ఆయన భారత్ వచ్చారు. జీ-20 సమావేశాలకు హాజరైన సునాక్ రక్షణ, భద్రత, సాంకేతికత, వాతావరణ మార్పులు, ఆరోగ్యం రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పురోగతిపై మోడీతో చర్చించారు. ఇక శుక్రవారం భారత్ కు వచ్చిన సునాక్ శనివారం అంతా కూడా జీ-20 సదస్సులో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈరోజు ఉదయం రిషి సునాక్ ఆయన భార్య అక్షరామూర్తితో కలిసి ఢిల్లీలోని అక్షరధామ్ టెంపుల్ ను దర్శించుకున్నారు. అక్కడ వారు దాదాపు గంట సేపు గడిపారు. బ్రిటన్ ప్రధాని రావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయ సిబ్బంది పూజా కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది.

ఇక తాను హిందువుగా పుట్టినందుకు ఎంతో గర్వపడతానని సునాక్ చాలా సందర్భాల్లో తెలిపారు. తన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి హిందు పద్దతులతో తనను పెంచారని ఆయన బాహాటంగానే ప్రకటించారు. ఈ మధ్య రక్షబంధన్ చేసుకున్నానని తెలిపిన సునాక్ జన్మాష్టమి చేసుకోలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు భార్య అక్షరమూర్తితో కలిసి ఆయన ఢిల్లీలోని అక్షరధామ్ టెంపుల్ ను దర్శించుకున్నారు. భారత్ లో ఈ ఆలయాన్ని సందర్శిస్తానని ముందుగా సునాక్ మీడియాకు ఈ విషయాన్ని చెప్పారు. చెప్పినట్లుగానే ఈ రోజు గుడిని సందర్శించారు.