Leading News Portal in Telugu

Komatireddy Venkat Reddy : సీఎం కేసీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి లేఖ


దళిత బంధు, బీసీ బంధులో కమీషన్ల పేరుతో మీ పార్టీ నాయకులు చేస్తున్న దోపిడీ గురించి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు భువనగిరి ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపయినర్ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి లేఖ రాశారు. తెలంగాణ లో మీరు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు, బీసీ బంధు పథకాలు పేద ప్రజలకు అందుతాయని ఆశించానని, గత వారం రోజులుగా నేను ఉమ్మడి నల్గొండ జిల్లా నియోజకవర్గాల పరిధిలోని దళిత బంధు, బీసీ బంధు మంజూరైన లిస్ట్ పరిశీలించానన్నారు కోమటిరెడ్డి. మీ పార్టీ కి సంబంధించిన అనర్హులైన వారికి మంజూరు చేశారని, ఉదాహరణకు తిప్పర్తి మండలం హెడ్ క్వార్టర్స్ లో 566 మంది దళిత కుటుంబాలు ఉంటే మీరు ఇచ్చిన 12 దళిత బంధు యూనిట్ లు కూడా మీ పార్టీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు మాజీలకు ఇవ్వడం జరిగిందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

అంతేకాకుండా.. ‘తుంగతుర్తి నియోజకవర్గం లో ఘోరమైన స్కాం జరిగింది అక్కడ 30 శాతం కమిషన్ తీసుకుంటూ బీసీ బంధు, దళిత బంధు యూనిట్లు మంజూరు చేశారు.. తిరుమలగిరి ని మీరు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి 180 కోట్లు మంజూరు చేస్తే 60 కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయి.ఇక్కడ లోకల్ ప్రజాప్రతినిధి ద్వారా వసూలు చేసిన కమిషన్ మంత్రి,ఎమ్మెల్యే ఎవరికి అందాయో సమగ్రమైన విచారణ జరిపించాలి. ప్రతిష్టాత్మకంగా మీరు చేప్పట్టిన ఈ పథకాలు పేద ప్రజలకు అందకుండా పక్కదారి పడుతున్నాయి
పేద దళితులకు అందాల్సిన 10 లక్షల రూపాయలు కమిషన్లకు ఆశపడి బీఆర్ఎస్ కార్యకర్తలకు కేటాయిస్తున్నారు..

అవినీతికి పాల్పడితే సొంత కొడుకునైనా విస్మరించనని పదే పదే చెప్పే మీరు దళితబంధు, బీసీ బంధు లో జరుగుతున్న అవినీతి పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు.కమిషన్ల వ్యవహారం పై మీకు కావాలంటే నా దగ్గర ఉన్న వివరాలు ఇస్తా,లీగల్ గా కూడా హైకోర్ట్ లో పిటిషన్ వేస్తాం. పేదలకు అందాల్సిన పథకాలు ఇలా కమిషన్ల రూపంలో బయటకు వెళ్ళడం ద్వారా మీకు ప్రజల్లో మంచి పేరు కాస్త చెడ్డ పేరుగా మారబోతుంది. పై అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరి హస్తం ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని లేకుంటే ప్రజల్లో మీ తీరును ఎండగడుతామని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాను’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.