Leading News Portal in Telugu

India vs Sri Lanka: అరుదైన రికార్డుకు చేరువ‌లో రోహిత్ శర్మ.. మ‌రో 22 ప‌రుగులే!


Rohit Sharma Eye on Virat Kohli’s Recod in IND vs SL Match: టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ అరుదైన మైలురాయికి చేరువ‌లో ఉన్నాడు. మ‌రో 22 ప‌రుగులు చేస్తే.. వ‌న్డేల్లో ప‌ది వేల ప‌రుగులు చేసిన క్రికెట‌ర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. శ్రీలంక‌తో జ‌రిగే మ్యాచ్‌లో రోహిత్ ఈ రికార్డును నెల‌కొల్పే అవకాశం ఉంది. ఆసియా క‌ప్‌ 2023లో దాయాది పాకిస్తాన్‌పై హిట్‌మ్యాన్ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అదే ఫామ్ లంకపై కొనసాగిస్తే.. భారత దిగజాల ఎలైట్ లిస్ట్ లో చేరాడు.

ఇప్ప‌టివ‌ర‌కు 247 వ‌న్డే మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శ‌ర్మ‌.. 9,978 ర‌న్స్ చేశాడు. ఇందులో 30 సెంచ‌రీలు ఉండగా.. 50 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. మూడుసార్లు వ‌న్డేల్లో డ‌బుల్ సెంచ‌రీ చేసిన రోహిత్.. అత్య‌ధిక స్కోర్ 264. వ‌న్డేల్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 452 ఇన్నింగ్స్‌లలో సచిన్ 18,426 రన్స్ చేశాడు. ఈ జాబితాలో భారత్ తరఫున విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ 267 ఇన్నింగ్స్‌లలో 12902 పరుగులు చేశాడు.

259 ఇన్నింగ్స్‌లలో 10,000 పరుగులు పూర్తి చేసిన సచిన్ టెండూల్కర్‌ను రోహిత్ శర్మ అధిగమించే అవకాశం ఉంది. సౌరవ్ గంగూలీ 263 ఇన్నింగ్స్‌లలో ఈ మార్క్ అందుకున్నాడు. ఈ జాబితాలో 205 ఇన్నింగ్స్‌కి పది వేల పరుగులు చేసిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. కేవలం ఐదుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే భారత్ నుంచి 10,000 పరుగులు చేశారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ మరియు ఎంఎస్ ధోనీ ఈ జాబితాలో ఉన్నారు.