Leading News Portal in Telugu

AP BJP: పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌.. ఇలా స్పందించిన ఏపీ బీజేపీ


AP BJP: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ క్లారిటీ ఇచ్చారు.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ములాఖత్‌లో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో కలిసిన ఆయన.. చంద్రబాబుతో ములాఖత్ ఏపీ రాజకీయాల్లో కీలకమైందని, వైసీపీ అరాచకాలను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని ప్రకటించారు పవన్‌.. ఇదే సమయంలో.. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి వెళ్లాలని తన కోరిక అని పేర్కొన్నారు.. కానీ, బీజేపీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. మీకు యుద్ధమే కావాలంటే, మేమూ యుద్ధమే చేస్తామంటూ తన విధానాన్ని ప్రకటించారు పవన్‌.. ఇప్పటి వరకు జనసేన-బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతుండగా.. పవన్‌ కల్యాణ్‌ ప్రకటన తర్వాత.. టీడీపీ-జనసేనతో బీజేపీ కలిసి వస్తుందా? అనే చర్చ సాగుతోన్న తరుణంలో.. కీలక ప్రకటన చేసింది ఏపీ బీజేపీ.

ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీతో బీజేపీ పొత్తు కొనసాగుతోందని.. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందని గతంలోనే పవన్ కల్యాణ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. కానీ, పొత్తుల అంశం బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని స్పష్టం చేసింది.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా? అనేదానిపై కేంద్ర నాయకత్వం స్పష్టత ఇస్తుందని పేర్కొంది ఏపీ బీజేపీ.. పొత్తులను ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా నిర్ణయిస్తారని క్లారిటీ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్‌ సమితి.