బాబోయ్ చంద్రబాబు.. బీఆర్ఎస్ లో వణుకు!? | i am with babu agitation in telangana| brs| fear| tdp| strength| assembly
posted on Sep 16, 2023 1:50PM
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలంగాణలో ఐటీ ఉద్యోగులు ఆందోళనలకు దిగడంతో అధికార బీఆర్ఎస్ కు కాళ్లూ చేతులూ ఆడటం లేదు. తెలంగాణ ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం నామమాత్రమేనని అధికార బీఆర్ఎస్ ఇంత కాలం అనుకుంటూ వచ్చింది. తెలంగాణ తెలుగుదేశం నేతలందరినీ ఏదో రకంగా బీఆర్ఎస్ గూటికి చేర్చుకున్న కేసీఆర్.. తదుపరి లక్ష్యం కాంగ్రెస్ అన్నట్లుగా అడుగులు వేశారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకూ బీఆర్ఎస్ అధినేత తాను లక్ష్యం సాధించేశాననే భావించారు. ఇక రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్ లు పూర్వ వైభవం సంతరించుకునే అవకాశం లేదన్న నిర్ణయానికి వచ్చిన తరువాత బీజేపీ టార్గెట్ గా పావులు కదపడం ప్రారంభించారు.
బీజేపీ నిర్ణయాలన్నిటికీ బేషరతుగా సమర్ధిస్తూ వచ్చిన కేసీఆర్.. రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్వీర్యం కావాలంటే బీజేపీ బలం పుంజుకోవాలన్నట్లుగా వ్యవహరించారు. ఇక కాంగ్రెస్ పనైపోయింది అనుకున్న తరువాత ఆయన బీజేపీని లక్ష్యంగా చేసుకుని.. కేంద్రంలో చక్రం తిప్పుతానంటూ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలలోకి దూకేశారు. అన్నీ ముహూర్తం చూసుకుని చేసే కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీ ఆవిర్భావానికి ఎంచుకున్న ముహూర్తం బెడిసి కొట్టినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో తిరుగే లేదనుకున్న కేసీఆర్ కు ఇప్పుడు అడుగడుగునా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఉనికి మాత్రంగా ఉందనుకున్న కాంగ్రెస్ తెలంగాణలో అనూహ్యంగా పుంజుకుంది. అధికారమే తరువాయి అన్నంతగా చెలరేగిన బీజేపీ ఒక్క సారిగా బలహీనపడిపోయింది. అయినా కూడా బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ఓట్ల చీలికతో మరోసారి అధికారం తమదే అన్న భావనలో ఉన్న బీఆర్ఎస్ కు ఏపీలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా తెలంగాణలో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఆందోళనలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
ఎలాంటి ఆర్గనైజేషన్ లేకుండా స్వచ్ఛందంగా వేల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు I am with Babu అంటూ రోడ్ల మీదకు వచ్చి ఆందోళనకు దిగడం బీఆర్ఎస్ కు దిగ్ర్భమకు గురి చేసింది. రాష్ట్రంలో తెలుగుదేశం పునాదులు కదలలేదనీ, నాయకులు లేకపోయినా క్యాడర్, జనం తెలుగుదేశంతోనే ఉన్నారనీ బాబుకు మద్దతుగా హైదరాబాద్ లో వెల్లువెత్తిన నిరసనలు నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి.
నిజమే.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తెలుగు దేశం పార్టీ తెలంగాణలో పూర్వవైభవాన్ని కోల్పోయింది. తెలంగాణ సెంటిమెంట్ ఉవ్వెత్తున ఎగసిపడిన ఉద్యమ సమయంలో తెలుగుదేశం అంటే టీడీపీ అంటే ఏపీ పార్టీ అనే ముద్ర పడింది. తెలంగాణ సెంటిమెంట్’ ను సొంతం చేసుకున్న బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన వాద్ధాటితో తెలుగుదేశం ఆంధ్రపార్టీ అనే ముద్ర పడేలా చేయగలిగారు. అదే సెంటిమెంట్ ను ఆసరాగా చేసుకుని రాజకీయ శక్తుల పునరేకీకరణ పేరిట తెలుగు దేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు పావులు కదిపారు. నేతలు ఒకరొకరుగా బీఆర్ఎస్ గూటికి చేరిపోవడంతో అనుకున్నది సాధిచేశానని భావించారు.
రాష్ట్ర విభజన నేపధ్యంగా జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ తెలంగాణలోనూ సత్తా చాటింది. తెలంగాణ తెచ్చామనే ఊపులో ఉన్న తెరాస (ఇప్పటి బీఆర్ఎస్)ను,ఇచ్చామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ దూకుడును ఎదుర్కుని 14.7 శాతం ఓట్లతో 15 సీట్లు గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు క్యూ కట్టి కారెక్కారు. గులాబీ గూటికి చేరారు. 2018 ముందస్తు ఎన్నికల నాటికి ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీకి మిగిలారు.
2014 బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, 2018లో తెలంగాణలో కాంగ్రెస్, సిపిఐతో కలిసి పోటీచేసింది. అయినా, టీడీపీ రెండు సీట్లు గెలుచుకుంది. అయితే ఓటు షేర్ 15 శాతం నుంచి మూడున్నర శాతానికి పడిపోయింది. అంతే కాదు, టీడీపీ టికెట్ పై గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కారెక్కి గులాబీ గూటికి కండువా కప్పుకున్నారు.అలాగే, పార్టీ రాష్ట అధ్యక్షుడు ఎల్.రమణ సహా దాదాపు సీనియర్ నాయకులంతా బీఆర్ఎస్ పంచన చేరిపోయారు. మిగిలిన వారు బీజేపీలోకి జంపయ్యారు. అయితే, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,శాశ్వత శత్రువులే కాదు, శాశ్వత బాహుబలులు కూడా ఉండరు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి.ఎదరు లేదు,తిరుగు లేదనుకున్న పార్టీ, నాయకుడు అనూహ్యంగా బొక్కబోర్లా పడతారు. కానీ, ఒకసారి బొక్కబోర్లా పడినంత మాత్రాన, అంతటితో ఆపార్టీ పనై పోయింది అనుకోవడం అయితే అజ్ఞానం లేదా అహంకారం తప్ప మరొకటి కాదు. తెలంగాణలో పనైపోయింది అనుకున్న తెలుగు దేశం పార్టీ ఇప్పుడు సెంటిమెంట్ బలంతో తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెక్ పెట్టే స్ధాయికి చేరిందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
తెలంగాణ సెంటిమెంట్ అండగా రాజకీయంగా ఎదిగిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ కోసం అదే తెలంగాణ సెంటిమెంట్ ను తన చేతులతో తానే తుడిచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగామార్చారు. రాజకీయ పునరేకీకరణ అంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిబ జేఏసీ చైర్మన్ కొదండరామ్ సహా ముఖ్యనేతలు అందరిని దూరం పెట్టారు. అదే సమయంలో ఉద్యమ సమయంలో తెలంగాణ ద్రోహులుగా తానే ముద్రవేసిన తలసాని, సబితా ఇంద్రారెడ్డి వంటి వారిని చేర్చుకుని మంత్రి పదవులతో సత్కరించారు. పార్టీని కుటుంబ పార్టీగా, రాష్ట్రాన్ని కుటుంబ సామ్రాజ్యంగా మార్చేశారు.
అయితే, తానొకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలిచాడు అన్నట్లుగా, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న కేసీఆర్ ఆకాంక్ష మొదటికే మోసం తీసుకువచ్చింది. ముఖ్యంగా 2018 అంతగా బలంగా లేని బీజేపీ, 2019 లోక్ సభ ఎన్నికల నాటికి పుంజుకుందన్నా, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని దీటుగా ఎదుర్కోనేందుకు సన్నద్ధమైందన్నా.. కేసీఆర్ జాతీయ ఆకాంక్షల పేరుతో తెలంగాణ సెంటిమెంటును పక్కన పెట్టేయడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక సారి రాష్ట్రంలో ఆ సెంటిమెంటు పక్కకు జరిగాక.. తెలుగుదేశం పార్టీకి కూడా రాష్ట్రంలో స్పెస్ పెరిగింది. ఆ విషయం గతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుఏడెనిమిది నెలల కిందట ఖమ్మం సభతో పూరించి శంఖా రావం సక్సెస్ రుజువు చేసింది. కారణాలేమైతేనేం.. తెలుగుదేశం శంఖారావం పేరుతో ఖమ్మంలో నిర్వహించిన సభ సక్సెస్ ఇచ్చిన ఊపును, జోరునూ ఆ తరువాత తెలుగుదేశం కొనసాగించలేదు. మరిన్ని సభలు నిర్వహిస్తామని అప్పట్లో ప్రకటించినా ఆ దిశగా అడుగులు వేయలేదు.
దాంతో తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోరే ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. తెలుగుదేశం పార్టీని పరిశీలకులు కూడా పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు.ఈ నేపథ్యంలోనే త్రిముఖ పోరులో మూడో సారి తెలంగాణలో విజయం సాధించి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని కేసీఆర్ తలపోశారు. కానీ ఏపీలో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటూ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడంతో నివురుగప్పిన రాష్ట్రంలో తెలుగుదేశం పునాదులు చెక్కు చెదరలేదన్న సంగతి బయటపడింది. ఇప్పుడు ఇదే కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను భయపెడుతోంది. ఏపీలో అరెస్టుకు వ్యతిరేకంగానే కదా.. ఆందోళనలు అని వదిలేద్దామంటే.. ఐటీ ఉద్యోగులు ఈ తొమ్మిదేళ్లుగా కేసీఆర్ సర్కార్ ప్రచారం చేసుకుంటున్న అభివృద్ధికి పునాదులు వేసింది చంద్రబాబే అని బలంగా చాటుతున్నారు. దాంతో తెలంగాణలో స్థిరపడిన సెటిలర్కు మాత్రమే కాదు.. సామాన్య జనం కూడా ఇప్పుడు తెలుగుదేశం కేసే చూసే పరిస్థితి ఏర్పడుతుందన్నది బీఆర్ఎస్, కేసీఆర్ భయం. అందుకే ఒకింత నష్టం జరుగుతుందని తెలిసినా.. ఆ ఆందోళనలను పోలీసు బలంతో అణచివేయడానికే నిర్ణయించుకుంది. అలాగే చేస్తోంది కూడా.
అయితే స్వచ్ఛందంగా ప్రారంభమైన ఆందోళనలు అణిచివేస్తే ఆగిపోతాయనుకోవడం భ్రమే అవుతుంది. అయినా తమిళనాడు, బెంగళూరు.. ఇలా ఒక చోటని కాకుండా దేశ వ్యాప్తంగా ఐటీ నిపుణులు రోడ్లపైకి వచ్చి ఐయామ్ విత్ బాబు అంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. హైదరాబాద్ లో కూడా ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అణచివేతకు ప్రయత్నించిన కొద్దీ చంద్రబాబుపై సానుభూతి మరింత పెరుగుతోందని పరిశీలకులు అంటున్నారు. ఈ ప్రభావం కచ్చితంగా ఈ ఏడాది చివరిలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందనీ, తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని స్థానాలలోనూ ఒంటరి పోరుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. కచ్చితంగా తెలుగుదేశం చెప్పుకోదగ్గ స్థానాలలో విజయం సాధిస్తుందనీ, ఒక వేళ రాష్ట్రంలో హంగ్ వస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీదే కీలక పాత్ర అవుతుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ కూడా అదే కారణంతో చంద్రబాబుకు మద్దతుగా జరుగుతున్న ఆందోళనలతో భయ పడుతోంది.