Leading News Portal in Telugu

TSRTC Nursing College: అత్యాధునిక‌ హంగులతో టీఎస్‌ఆర్టీసీ నర్సింగ్‌ కళాశాల


అత్యాధునిక హంగులతో నిర్మించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నర్సింగ్ కళాశాల నూతన భవనం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.10 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్థుల భవన సముదాయాన్ని సంస్థ నిర్మించింది. హైదరాబాద్ తార్నాక ఆస్పత్రి ప్రాంగణంలో నేడు (శనివారం ) నర్సింగ్ కళాశాల నూతన భవనాన్ని సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. అనంతరం తరగతి గదులు, ల్యాబొరేటరీలను పరిశీలించారు. నూతన భవనంలో విద్యార్థులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తార్నాక టీఎస్ఆర్టీసీ ఆస్పత్రికి అనుసంధానంగా 2021-22 విద్యా సంవత్సరం నుంచి నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి వైద్య రంగంలో మంచి భవిష్యత్ ఉందని, విద్యార్థులందరూ టీఎస్ఆర్టీసీ అందిస్తోన్న నర్సింగ్ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఆస్పత్రుల్లో నర్సులు కుటుంబ సభ్యుల్లాగా రోగులను పరిగణించి.. అత్యుత్తమ సేవలను అందిస్తున్నారని బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. చికిత్స సమయంలో రోగులకు తల్లికంటే ఎక్కువగా సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలను నిలబెడుతున్న నర్సుల సేవలు ఎనలేనివని ఆయన కొనియాడారు.

త‌న‌తో పాటు సజ్జనార్ పట్టుదల, వ్యూహాత్మక నిర్ణయాలతో సంస్థ పురోభివృద్ధి సాధ్యం అవుతోందని, తాను చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయం నాటికి ఇప్పటికి సంస్థలో గణనీయంగా నష్టాలు తగ్గుముఖం పట్టాయని బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద మనసుతో సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. నర్సింగ్‌ కోర్సుకు మంచి డిమాండ్‌ ఉన్నది.. కోర్సు పూర్తి చేసిన నర్సింగ్‌ విద్యార్థులకు విదేశాలలోనూ అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి.. అందుకే, కష్టపడి చదివి విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. గత కొన్నేళ్ల క్రితం నర్సింగ్‌ కళాశాలను పెట్టాలని ఆలోచించిన విషయాన్ని గుర్తు చేస్తూ నేడు కేవలం 12 నెలల కాలంలోనే నర్సింగ్‌ కళాశాల భవనం మెరుగైన సదుపాయాలతో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇది గోల్డెన్‌ ఛాన్స్‌ అంటూ నర్సింగ్‌ విద్యార్థులు బాగా చదువుకుని అటు కుటుంబ సభ్యులకు, ఇటు సంస్థకు మంచి పేరు తీసుకురావాలని సజ్జనార్ కోరారు.

అయితే, నర్సింగ్‌ కళాశాల భవనాన్ని రూ.10 కోట్లతో నిర్మించారు. ఈ కళాశాల 50 మంది విద్యార్థులతో 2021-22 విద్యా సంవత్సరంలో ప్రారంభమైన ఈ కాలేజ్ లో మేనేజ్‌మెంట్ కోటా 20 సీట్లలో ఆర్‌టీసీ ఉద్యోగుల పిల్లలకు యూనివర్సిటీ విద్యార్థులతో సమానంగా ఐదు సీట్లు కేటాయించడం జరుగుతోంది. నర్సింగ్ కోర్సులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులు త్రిష, అమూల్యను ఘనంగా సన్మానించారు. త్రిషకు రూ.10 వేలు, అమూల్యకు రూ.7 వేల నగదు పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు.