Leading News Portal in Telugu

AP CM Jagan: రెండు రోజుల పాటు సీఎం జగన్‌ బిజీ షెడ్యూల్ ఇదే..


AP CM Jagan: రేపు, ఎల్లుండి సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు(సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకోనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. శ్రీనివాస సేతు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఎస్‌వీ ఆర్ట్స్‌ కాలేజ్‌ హాస్టల్‌ బిల్డింగ్‌ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని గంగమ్మను దర్శనం చేసుకోనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి తిరుమలకు వెళ్లనున్నారు. వకుళామాత రెస్ట్‌ హౌస్, రచన రెస్ట్‌ హౌస్‌ల ప్రారంభోత్సవంలో పాల్గొని వాటిని ప్రారంభించనున్నారు. బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ప్రధాన ఆలయానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. వాహన మండపం వద్దకు చేరుకుని పెద్ద శేష వాహనాన్ని దర్శనం చేసుకోనున్నారు. రాత్రికి పద్మావతి అతిధి గృహంలో బస చేయనున్నారు.

ఈ నెల 19న సీఎం జగన్ షెడ్యూల్‌
ఈ నెల 19న ఉదయం 6.20 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారిని సీఎం జగన్ దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి కర్నూలు జిల్లాకు సీఎం జగన్ ప్రయాణం కానున్నారు. కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి మండలం లక్కసాగరానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు సంబంధించి తాగు, సాగునీరందించే పథకాలను ప్రారంభించనున్నారు. నంద్యాల జిల్లా డోన్‌లో బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరిగి తాడేపల్లికి సీఎం జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు.