Leading News Portal in Telugu

Virat Kohli: కెనడాలో టెన్షన్ టెన్షన్.. ఫేవరెట్ సింగర్‌ను అన్ ఫాలో చేసిన విరాట్


ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్యతో భారత్‌కు సంబంధం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్స్ తో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే, కెనడాలో ఉంటున్న ప్రముఖ భారత గాయకుడు శుభ్‌నీత్ సింగ్‌ విమర్శల్లో చిక్కుకున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ లాంటి ప్రముఖ క్రికెటర్లు అతడిని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశారు. దీంతో అతడి భారత్‌ పర్యటన కూడా రద్దయ్యింది.

అయితే, పంజాబ్‌కు చెందిన సింగర్, నటుడు రన్‌వీత్‌ సింగ్‌ సోదరుడైన శుభ్‌నీత్‌ కొన్నేళ్ల క్రితం కెనడాలో స్థిరపడ్డాడు. అక్కడి నుంచే తన ర్యాప్‌ సింగింగ్‌ జర్నీని స్టార్ట్ చేశాడు. 2021లో అతడు ‘వి రోల్‌ ఇన్‌’ పేరుతో ఓ ఆల్బమ్‌ సాంగ్‌ రిలీజ్ చేశాడు. అది ప్రపంచవ్యాప్తంగా భారీగా పాపులర్ అయింది. కోట్ల మంది ఆ సాంగ్ ను వీక్షించారు. ఆ తర్వాత ‘డోంట్‌ లుక్‌’ పాటతో ర్యాప్‌ ప్యాన్స్ కి మరింత దగ్గరయ్యాడు. దీంతో ‘స్టిల్‌ రోల్‌ ఇన్‌’ పేరుతో ర్యాప్‌ సింగర్‌గా తన తొలి భారత్‌ టూర్‌ను శుభ్ నీత్ ఇటీవల ప్రకటించాడు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 10 నగరాల్లో తన ప్రదర్శనలిచ్చేందుకు రెడీ అయ్యాడు. సెప్టెంబరు 23-25 తేదీల్లో ముంబయిలో అతడు పర్యటించాల్సి ఉంది.

ఇక, శుభ్‌ నీత్ ఇటీవల సోషల్ మీడియాలో ఖలిస్థానీ ఉద్యమానికి సపోర్ట్ గా కొన్ని పోస్టులు చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని అభ్యంతకర ఫొటోలు పోస్ట్ చేశాడు. దీంతో అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో.. అతడి ప్రదర్శనను క్యాన్సిల్ చేయాలని ఇటీవల ముంబయిలో బీజేపీ యువజన విభాగం నిరసనకు దిగింది. శుభ్‌ నీత్ ఫేవరెట్‌ ఆర్టిస్ట్‌ అని గతంలో ఓసారి విరాట్ కోహ్లీ చెప్పాడు.. కేఎల్ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, సురేశ్ రైనా తదితర క్రికెటర్లు కూడా శుభ్‌ను ఇన్‌స్టాలో ఫాలో అయ్యారు. అయితే తాజా పరిణామాలతో వీరందరూ అతడిని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసినట్లు సమాచారం.