ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ విద్యార్థులకు అందుబాటులోకి ఐబీ సిలబస్ ను తీసుకొచ్చింది. అంతర్జాతీయంగా ప్రభుత్వ బడి పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు. ఐబీ సిలబస్ ప్రవేశంపై ఇప్పటికే మార్గదర్శక ప్రణాళిక తయారీకి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఐబీ సిలబస్ను ప్రవేశపెట్టే నిర్ణయానికి ఇవాళే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ఐబీ సంస్థతో ఎంఓయూ కార్యక్రమం జరిగింది. సచివాలయంలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఐబీ సంస్ధతో రాష్ట్ర ప్రభుత్వం ఏంఓయూ చేసుకుంది. ఎంఓయూపై ఐబీ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ మాట్ కాస్టెల్లో, ఏపీ విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సంతకాలు చేశారు. సింగపూర్, వాషింగ్టన్ డీసీ, జెనీవా, యూకేల నుంచి వీడియో కాన్ఫరెన్స్లో ఐబీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. విద్యలో నాణ్యతను పెంచడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. మా పిల్లలను ప్రపంచంలో అత్యుత్తమ విద్యార్థులగా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం.. అందుకోసమే మీ సహకారాన్ని కోరుతున్నాం.. ఇక్కడ విద్యార్థులు సంపాదించే సర్టిఫికెట్ ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటు అయ్యేలా ఉండాలన్నది నా ఉద్దేశం అని సీఎం అన్నారు. మరే ఇతర ఐబీ ఇంటర్నేషనల్ స్టూడెంట్తో అయినా సరిసమానంగా ఉండాలి.. అట్టడున ఉన్న విద్యార్ధులకు దీన్ని అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అతిపెద్ద విజయం.. ఐబీ సిలబస్ అన్నది సవాల్తో కూడుకున్నది.. అందులోనూ ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టడం అన్నది అటు మీకు కూడా సవాల్తో కూడుకున్నది.. కానీ సంకల్పం ఉంటే సాధ్యంకానిది ఏది లేదు అని జగన్ అన్నారు.
పాఠశాల విద్యను బలోపేతంచేయడానికి మేం ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని సీఎం జగన్ తెలిపారు. పాఠశాల విద్యను అత్యంత నాణ్యంగా తీర్చిదిద్దాం.. స్కూళ్లను బాగుచేయడం దగ్గరనుంచి… తరగతిగదుల డిజిటిలైజేషన్ వరకూ అనేక చర్యలు తీసుకున్నామన్నారు. 6వ తరగతి నుంచి అన్ని తరగతి గదులనూ డిజిటలైజేషన్ చేస్తున్నాం.. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేశాం.. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబులు పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు. పిల్లలందరికీ బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ తీసుకు వచ్చాం.. పిల్లాడిని స్కూలుకు పంపే తల్లికి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని చెప్పారు. టోఫెల్ పరీక్షల్లో శిక్షణ.. టోఫెల్ ప్రైమరీ, ఆ తర్వాత టోఫెల్ జూనియర్, టోఫెల్ సీనియర్ విభాగాలుగా వీటిని విద్యావ్యవస్ధలో భాగం చేశాం.. ప్రతిరోజూ ఒక పీరియడ్ టోఫెల్లో పిల్లలకు శిక్షణ ఇస్తున్నామని సీఎం జగన్ అన్నారు.
అన్ని స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంలో బోధిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. విద్యా ప్రమాణాలను పెంచడానికి అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నాం.. దీంట్లో భాగంగానే ఐబీని తీసుకు వచ్చాం.. మీ సహకారంతో దీన్ని చేపడుతున్నాం.. ఇది ఒక రోజుతో సాధ్యం అయ్యేది కాదు.. ఒకటో క్లాసుతో ఇవాళ మొదలు పెడితే దీని ఫలితాలు పదేళ్ల తర్వాత కనిపిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఏడాదికి ఒక్కో తరగతి పెంచుకుంటూ పోవాలి.. ఇలా చూసుకుంటే పూర్తిస్థాయిలో రావడానికి పదేళ్లు పడుతుంది.. దిగువ స్థాయిలో ఉన్న పేదల వారి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావడమే మా ఉద్దేశం.. దేవుడి దయ వల్ల ఈ లక్ష్యం సిద్ధిస్తుంది.. దీంట్లో ఐబీ భాగస్వామ్యానికి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు.