Leading News Portal in Telugu

అసెంబ్లీలో బాలకృష్ణ, అంబటి మధ్య వాగ్వాదం.. సవాళ్లు, ప్రతి సవాళ్లు | heated arguement in assembly| balakrishan| ambati| speaker| podium| tdp


posted on Sep 21, 2023 9:55AM

ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నినాదాలు చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు. ఆ  దశలో అంబటి రాంబాబు తెలుగుదేశం సభ్యులను ఉద్దేశించి హెచ్చరికలు చేశారు. స్పీకర్ పై దాడికి ప్రయత్నాస్తున్నారంటూ ఆరోపించి, వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరడమే కాకుండా.. ఆయన చర్యలు తీసుకోకుంటే తామే తీసుకుంటామని అర్ధం వచ్చేలా చెప్పారు. తమ సభ్యులలో ఓవర్ యాక్షన్ చేయగల వారు ఉన్నారనీ, వారు రంగంలోకి దిగితే.. సభలో అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని హెచ్చరించారు.   తాము రెచ్చిపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. ఆ సందర్బంగా బాలకృష్ణ మీసం తిప్పారంటూ …అంబటి దమ్ముంటూ రా అంటే అంటూ పరుషంగా మాట్లాడడమే కాకుండా, తొడకొట్టారు. దీంతో సభలో అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎవరేం మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఆ దశలో స్పీకర్ సభను వాయిదా వేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు  తెలుగుదేశం సభ్యులు పాదయాత్రగా వెళ్లారు. తొలుత వెంకటాయపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన తరువాత సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి శాసనసభ వరకు పాదయాత్రగా వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు వీరి పాదయాత్రలో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రమోహన్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు కూడా పాల్గొన్నారు.  కాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాజధాని ప్రాంతంలో పోలీసులు కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇంచుమించుగా అడుగుకో పోలీసు చొప్పున మోహరించారు. ఇక అసెంబ్లీ దారిలో పొలాలలో  కూడా కూంబింగ్ చేపట్టారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పరిసరాల్లో మెటల్‌ డిటెక్టర్‌, బాంబు స్క్వాడ్‌ తనిఖీలు నిర్వహించారు.   జగన్‌ వస్తున్న సమయంలో బలగాలు పొలాల్లోనూ కాపలా కాశారు.