తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రజలకు మరింత సేవలందించేందుకు కొత్త కొత్త స్కీంలను ప్రవేశపెడుతోంది. ఇప్పటకే చాలా వినూత్న పథకాలకు టీఎస్ఆర్టీసీ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే మరోసారి ప్రజలకు మరో ఆఫర్ను ప్రకటించింది. దసరా పండుగ సందర్భంగా సొంతుళ్లకు వెళ్లే వారూ ముందుగా టీఎస్ఆర్టీసీలో బస్సు టికెట్లను బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ అందిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 15 నుంచి 29లోపు ఒకే సమయంలో టికెట్లు బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంలో 10 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. ఆయా తేదీల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేదీ వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని సర్వీసుల్లో రాయితీ వర్తిస్తుందని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాలకు కూడా చాలా మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు 10 శాతం రాయితీ ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. ఈ తగ్గింపు దసరా పండుగ సెలవుల్లో 15 రోజులు మాత్రమే వర్తిస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ రాయితీ సౌకర్యాన్ని వినియోగించుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. TSRTC బస్సులలో ముందస్తు రిజర్వేషన్ కోసం సంస్థ యొక్క అధికారిక వెబ్సైట్ www.tsrtconline.in ని సంప్రదించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.