టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ చేయడంపై తెలంగాణలోని ఐటీ ఉద్యోగులు ఆయన కుటుంబానికి సపోర్టుగా నిలుస్తున్నారు. ఆయన అరెస్టును ఖండిస్తూ ఇప్పటికే వివిధ మార్గాల్లో నిరసన తెలుపుతున్నారు. తాజా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ప్రొఫెషనల్స్ కార్ల ర్యాలీ తీశారు. నేడు (ఆదివారం) తెల్లవారుజాము నుంచే ఈ ర్యాలీ స్టార్ట్ అయింది. కారులతో సంఘీభావ యాత్ర అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఎవరికి వారు తమ కార్లు తీసుకొని హైదరాబాద్ లోని గచ్చిబౌలి, ఎస్ఆర్ నగర్, ఎల్బీనగర్ రోడ్ల ప్రాంతాల నుంచి వెళ్లారు. వీరంతా రాజమహేంద్రవరానికి చేరుకోనున్నారు.
రాజమండ్రిలో ఉన్న చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని ఐటీ ప్రొఫెషనల్స్ కలవనున్నారు. ఆమెకు సంఘీభావం తెలియజేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఐటీ ఉద్యోగులు నిర్వహిస్తున్న కార్ల ర్యాలీకి పర్మిషన్ లేదని ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉందని పేర్కొన్నారు. కాబట్టి ఐటీ ప్రొఫెషనల్స్ కార్ల ర్యాలీలకు పర్మిషన్ లేదని విజయవాడ పోలీసు కమిషనర్ నిన్న (శనివారం) ఓ ప్రకటనను విడుదల చేశారు. రూల్స్ బ్రేక్ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఈ ర్యాలీను అడ్డుకునేందుకు ఏపీ – తెలంగాణ బార్డర్ లో పలు చోట్ల చెక్ పోస్టులు పెట్టారు. పోలీసుల బలగాలు పెద్ద సంఖ్యలో చేరుకున్నాయి.
ఐటీ ప్రొఫెషనల్స్ కార్ల ర్యాలీలు వివిధ మార్గాల్లో వస్తుండటంతో వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు. విజయవాడ వైపు వెళ్లే కార్లను ఆపి తనిఖీ చేసి మరీ పంపిస్తున్నారు. పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఖమ్మం మీదుగా రాజమండ్రికి వెళ్తున్నారు. బ్యాచ్లుగా విడిపోయి రాజమండ్రి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు.