CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో.. గేరు మార్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇన్ని రోజులు చేసిన క్యాంపెయిన్ ఒకెత్తు.. ఇప్పటి నుంచే చేసే కార్యక్రమాలు మరో ఎత్తన్నారు. 175కి 175 సీట్లలో గెలవడం సాధ్యం కాబట్టే.. వైనాట్ 175 అంటున్నామన్నారు. గ్రౌండ్ లెవల్లో పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయన్న ఆయన.. అందుకే ప్రతిపక్షం వాళ్లు ఒంటరిగా రాకుండా పొత్తులు వెతుక్కుంటున్నారని తెలిపారు. ఇప్పటి దాకా చేసింది ఒకెత్తయితే…ఈ ఆరు నెలలు మరో ఎత్తని స్పష్టం చేశారు. ప్రజల్లో మమేకమవుతూనే…ఆర్గనైజేషన్, ప్లానింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
అసెంబ్లీ టికెట్ల పైన సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరం కుటుంబసభ్యులమేనన్న జగన్.. చాలా మందికి టికెట్లు రావచ్చని.. మరి కొందరికి ఇవ్వలేకపోవచ్చన్నారు. మీరున్న పరిస్థితిని బట్టి.. ఏది కరెక్టు అని తీసుకునే అడుగును బట్టి కొన్ని నిర్ణయాలు ఉంటాయన్నారు. టికెట్ ఇవ్వకపోతే తన మనిషి కాకుండా పోడని.. టికెట్ రాకపోయినా వారంతా కూడా తన వారేనని స్పష్టం చేశారు. జుట్టు ఉంటే ముడివేసుకొచ్చని…జుట్టు లేకపోతే ముడి వేసుకునేది ఏమీ ఉండదన్నారు సీఎం జగన్.
టికెట్లు ఇచ్చే విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు తన నిర్ణయాలకు పెద్ద మనసుతో సహకరించాలని కోరారు. ఇది కాకపోతే ఇంకోటి ఇస్తానని…అది కాకపోతే ఇంకోటి జరుగుతుందని భరోసా ఇచ్చారు. పార్టీ మీద, నాయకుడి మీద నమ్మం ఉంచాలని జగన్ సూచించారు. నాయకుడి మీద నమ్మకం ఉంచినపుడే అడుగులు కరెక్ట్గా పడతాయన్నారు. సర్వేలు కూడా ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయన్న జగన్… రెండు నెలల్లో ఎంత ఎక్కువ ప్రజల్లో ఉంటే అంత మంచి పలితాలు వస్తాయని సూచించారు. వై ఏపీ నీడ్స్ జగన్, జగనన్న సురక్ష కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు.