నేడు తెలంగాణకు వస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తెలిపారు. ఇవాళ మహబూబ్ నగర్కు వస్తున్నట్లు తెలిపిన ఆయన బీజేపీ ర్యాలీలో ప్రసంగిస్తానని పేర్కొన్నారు. మహబూబ్నగర్లో 13,500 కోట్ల రూపాయలకు పైగా రహదారులు, కనెక్టివిటీ, ఎనర్జీ, రైల్వేలతో సహా విభిన్న రంగాలకు చెందిన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోడీ వస్తున్నారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.
ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రధాని మోడీ చేరుకుంటారు. 1.35కి విమానాశ్రయం నుంచి వాయుసేన ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 2.05 గంటలకు పాలమూరుకు చేరుకుని.. 2.15-2.50 గంటల వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటారు. ఇక, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీజేపీ పార్టీ నిర్వహిస్తున్న సన్నాహాక బహిరంగసభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో సాయంత్రం 4.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు.
అయితే, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉండటంతో బీజేపీ నేతలు జోరుగా సభ ఏర్పాట్లు చేశారు. దాదాపు లక్షకు పైగా జన సమీకరణ చేస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసి ఎన్నికల శంఖారావం పురించాలని భావిస్తున్నారు. ఇప్పటికే పాలమూరు జిల్లాలో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకూండ తగిన చర్యలు తీసుకున్నారు.