Leading News Portal in Telugu

Pak Army Chief: పాక్ నుంచి ఉగ్రవాదాన్ని తొలగిస్తాం.. బలూచిస్తాన్ పేలుళ్లపై పాక్ ఆర్మీ చీఫ్


Pak Army Chief: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సు, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 65 మంది చనిపోయారు. శుక్రవారం జరిగిన ఈ దాడులతో పాకిస్తాన్ కలవరపడుతోంది. అయితే ఈ దాడిపై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్పందించారు. పాక్ నుంచి ఉగ్రవాద ముప్పును నిర్మూలిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. మస్తుంగ్ లోని మదీనా మసీదు సమీపంలో మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా జరిగిన ఊరేగింపు లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు, చాలా మంది తీవ్రగాయాలపాలయ్యారు.

బలూచిస్తాన్ దాడిలో 60 మంది చనిపోగా.. ఖైబర ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో హంగు పోలీస్ స్టేషన్ మసీదు లక్ష్యంగా జరిగిన దాడిలో ఐదుగురు మరణించారు. పేలుడు ధాటికి మసీదు పైకప్పు కూలి 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనల తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ బలూచ్ రాజధాని క్వెట్టాలో పర్యటించారు. ఇస్లాంతో సంబంధం లేని వ్యక్తులు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వ మద్దతుతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మునీర్ అన్నారు.

ఈ ఉగ్రవాదులు, వారికి సహకరించే వారికి మతం, దాని భావజాలంతో సంబంధం లేదని, పాకిస్తాన్, ఇక్కడి ప్రజలకు శతృవులని ఆయన అన్నారు. ఇతర దేశాల మద్దతు ఉన్న ఈ ఉగ్రవాదాన్ని పాక్ భద్రతా బలగాలు ఎదుర్కొంటాయని మునీర్ అన్నారు. దేశం నుంచి ఉగ్రవాద ముప్పును తరిమికొట్టే వరకు విశ్రమించమని చెప్పారు. అయతే శుక్రవారం పాకిస్తాన్ లో జరిగిన దాడులకు ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా బాధ్యత వహించలేదు. పాకిస్తాన్ తాలిబాన్లు తమ ప్రమేయం లేదని చెప్పారు.