Leading News Portal in Telugu

Big Breaking: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పీఆర్‌సీని ఏర్పాటు చేసిన కేసీఆర్ సర్కారు


Telangana government constitutes second PRC: ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ కేటగిరీల్లోని ఉద్యోగులకు వేతన స్కేళ్లను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండో పే రివిజన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఉద్యోగులకు 5 శాతం మధ్యంతర ఉపశమనం(ఐఆర్) కల్పించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సిఫార్సు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, పంట రుణాల మాఫీ, దళిత బంధు వంటి కీలకమైన ప్రధాన పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిమితులు ఎదుర్కొంటున్నప్పటికీ కొత్త పీఆర్‌సీని ప్రకటించింది. ఈ పీఆర్‌సీకి రిటైర్డ్ బ్యూరోక్రాట్ ఎన్. శివశంకర్ నేతృత్వం వహిస్తుండగా, మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి. రామయ్య కమిషన్ సభ్యుడిగా ఉంటారు.

రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి సీఆర్‌ బిస్వాల్ నేతృత్వంలోని మొదటి పీఆర్‌సీ చేసిన సిఫార్సులు జూలై 1, 2018 నుంచి అమలులోకి వచ్చినందున ఈ పీఆర్‌సీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రభుత్వం జూలై 1, 2023 నుంచి అమల్లోకి వచ్చేలా సిబ్బందికి కొత్త వేతన స్కేళ్లను అమలు చేయవలసి ఉంది. తదనుగుణంగా కమిషన్ తన సిఫార్సులను ఆరు నెలల్లోగా సమర్పించాలని కోరింది. పీఆర్‌సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, స్టాఫ్‌ను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ప్రభుత్వం ఆదేశించింది. రెగ్యులర్ ప్రభుత్వ సిబ్బంది, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాల పెంపు వర్తింపజేసింది. అంగన్‌వాడీ టీచర్లను వేతన సవరణ సంఘం పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఈసారి చురుగ్గా పరిశీలిస్తోందని, ఇది సిఫార్సు చేసిన తేదీ నుంచి వారికి పే స్కేలు ఇవ్వాలనే కమిషన్ నిర్ణయాన్ని బట్టి రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడుతుందని చెబుతున్నారు.