Monsoon: అనుకున్నట్లుగానే ఎల్ నినో రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపించింది. రుతుపవన వర్షపాతం 2023లో ఐదేళ్ల కనిష్టానికి చేరుకుంది. 2018 నుంచి పరిశీలిస్తే ఈ ఏడాదే తక్కువ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. 3 ట్రిలియన్ డాలర్ల ఉన్న ఆర్థిక వ్యవస్థకు రుతుపవనాలు చాలా కీలకం. పంటలకు నీరందించడానికి, జలశయాలను నింపడానికి అవసరమైన 70 శాతం వర్షాన్ని రుతుపవనాలే అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కవగా నీటి సరఫరా వ్యవస్థ లేకపోవడంతో వ్యవసాయానికి రుతుపవనాలే చాలా కీలకం.
ఇదిలా ఉంటే ఒకవేళ వేసవి వర్షాలు కూడా తగ్గితే దేశంలో ఆహార ద్రవ్యోల్భణం పెరుగుదలకు దారి తీసే ప్రమాదం ఉంది. చక్కెర, పప్పులు, బియ్యం, కూరగాయలు వంటి వాటి ఉత్పత్తి తగ్గితే మరింత ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ పరిణామాలు ఏర్పడితే బియ్యం, చక్కెర, గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ వాటిపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
రుతుపవనాల కొరత ఉన్నప్పటికీ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇక జూన్-సెప్టెంబర్ కాలంలో సగటు వర్షపాతంలో 94 శాతమే వర్షపాతం నమోదైంది. రుతపవనాల ప్రారంభానికి ముందు ఎల్ నినో ప్రభావాన్ని ఉహించి 4 శాతం లోటు ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
సాధారణంగా పసిఫిక్ ప్రాంతంలో సముద్ర జలాలు వేడెక్కడాన్ని ఎల్ నినోగా చెబుతారు. దీని వల్ల భారత ఉపఖండంతో వర్షాలు తగ్గి, పొడి పరిస్థితులు ఏర్పడుతాయి. ఈ ఏడాది జూన్ నెలలో రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. దీంతో ఆ నెలలో 9 శాతం తక్కువ వర్షాలు పడ్డాయి. జూలై నెలలో సగటు కన్నా 13 శాతం వర్షాలు అధికంగా కురిశాయి. ఆగస్టులో 36 శాతం లోటు ఏర్పడింది. మళ్లీ సెప్టెంబర్ నెలలో 13 శాతం అధికంగా వర్షాలు కురిశాయి.
ఇదిలా ఉంటే ఇప్పటికే కేంద్ర బియ్యం ఎగుమతిపై ఆంక్షలు విధించింది. ఉల్లి ఎగుమతిపై 40 శాతం సుంకం విధించింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆగస్టులో వర్షపాతం తగ్గడంతో చక్కెర పంట ఉత్పాదకత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో రానున్న కాలంలో చక్కెర ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.