Leading News Portal in Telugu

Hyderabad Man Kills in London: లండన్‌లో హైదరాబాద్ వాసి దారుణ హత్య.. కూతురి పెళ్లి కోసం వస్తుండగా..!


Hyderabad Man Rayees Uddin stabbed to death in London: లండన్‌లో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ఖాజా రైసుద్దీన్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. 65 ఏళ్ల రైసుద్దీన్.. వెస్ట్ యార్క్‌షైర్‌లోని హిల్ టాప్ మౌంట్ ప్రాంతంలో చంపబడ్డాడు. దుండగులు కత్తితో పొడిచి అతడిని దారుణంగా చంపేశారు. అనంతరం రైసుద్దీన్ వద్ద ఉన్న నగదును దుండగులు దోచుకున్నారని సమాచారం తెలుస్తోంది. రైసుద్దీన్ మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు లండన్‌లోని భారత హైకమిషన్‌ ప్రయత్నాలు చేస్తోంది.

మహ్మద్ ఖాజా రైసుద్దీన్ సహా ఇద్దరు వ్యక్తులు కూడా దుండగుల దాడిలో చనిపోయినట్లు తెలుస్తోంది. అందులో ఒకరు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన వారు అని ప్రాథమిక నివేదికలు ధృవీకరించాయి. ఉగాండా జాతీయుడితో వాగ్వాదం తర్వాత ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. 2011 నుంచి లండన్‌లో ఉంటున్న రైసుద్దీన్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుమార్తె వివాహం అక్టోబర్ 5న జరగాల్సి ఉంది.

కూతురు పెళ్లి కోసం హైదరాబాద్‌ వచ్చే సమయంలో దుండగులు మహ్మద్ ఖాజా రైసుద్దీన్‌పై దాడి చేసినట్లు సమాచారం. కూతురి పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో రైసుద్దీన్ మృతి వార్త కుటుంబసభ్యులకు షాక్‌కు గురిచేసింది. రైసుద్దీన్ మృతదేహన్ని హైదరాబాద్‌ రప్పించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను హిల్ టాప్ మౌంట్ పోలీసులు అరెస్టు చేశారట. హత్యకు దారితీసిన అసలు కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు.