Leading News Portal in Telugu

Bandi Sanjay: కారు గ్యారేజీకి పోతోందని నారాజ్‌ అయితున్నడు.. ‘X’ వేదికగా కేటీఆర్ పై బండి విమర్శలు


మంత్రి కేటీఆర్ పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ‘X’ వేదికగా విమర్శలు గుప్పించారు. పాపం కారు గ్యారేజీకి పోతోందని #TwitterTillu నారాజ్‌ అయితున్నడని తెలిపారు. నిజామాబాద్‌ల చెల్లె ఓటమి ఖాయమైందని ముందే ఆగమైతున్నడని పేర్కొన్నారు. కానీ ఏం ఫాయిదా?.. తొమ్మిదేళ్ల మీ దొంగ హామీల దొంగ జపం బట్టబయలైందని ప్రస్తావించారు. అలాగే.. వరంగల్‌ డల్లాస్‌ కాలే, కనీసం బస్టాండ్‌ కూడా రాలే.. వరదలు, బురదలు బోనస్ అన్నారు. నిజామాబాద్‌లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలే.. 100 కుటుంబాలు కూడా బాగుపడలే, 100 ఏళ్లకు సరిపడా దోపిడీ మాత్రం జరిగిందని దుయ్యబట్టారు.

మరోవైపు ఆదిలాబాద్‌కు ఎయిర్‌ అంబులెన్స్‌లు రాలేదన్నారు. కనీసం అంబులెన్స్‌ పోయే తోవ కూడా ఎయ్యలేదని విమర్శించారు. గతి లేక గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు మాత్రం ఎక్కువైనయని తెలిపారు. కరీంనగర్‌ లండన్ కాలే.. వేములవాడకు ఏటా రూ.100 కోట్లు అందలేదన్నారు. కొండగట్టు అంజన్న ఘాట్‌రోడ్డు గతి మారలేదని.. గులాబీ కబ్జాకోర్లు, కీచకులు మాత్రం పెరిగారని మండిపడ్డారు. లక్ష ఉద్యోగాలు రాలే, 3000 భృతి ఇయ్యలే, రైతుల ఆత్మహత్యల ఆగలే, పోడు పంచాయతీ పోలేదన్నారు.

అంతేకాకుండా.. ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ కాలే, పదోన్నతులు పూర్తిగాలేదన్నారు. కొత్త పీఆర్‌సీ అమలు నోచుకోలే, ఠంచనుగా జీతాలు రాలేదని తెలిపారు. కానీ.. తొమ్మిదేండ్లలో కల్వకుంట్ల ఖజానా నిండిందని.. కల్వకుంట్ల భజనకారులకు కోట్ల కమీషన్లు అందినయి తప్ప, కష్టపడి కొట్లాడిన తెలంగాణ ప్రజలకు ఒరిగిందేం లేదని అన్నారు. తొమ్మిదేండ్లు గాడిద పండ్లు తోమి.. ఇప్పుడు గాయి చేస్తే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదన్నారు. దొంగ హామీలు, దగా మాటలు, దౌర్జన్య చేతలకు కాలం చెల్లిందని ‘X’ వేదికగా బండి సంజయ్ విరుచుకుపడ్డారు.