Leading News Portal in Telugu

CM YS Jagan Meet Amit Shah: ఢిల్లీలో సీఎం జగన్‌ మకాం.. అమిత్‌షాతో గంట పాటు చర్చలు


CM YS Jagan Meet Amit Shah: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. సమావేశాలు.. భేటీలతో బిజీబిజీగా గడుపుతున్నారు.. ఇవాళ్టితో ఆయన పర్యటన ముగియనుండగా.. రేపు తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు.. అయితే, హస్తిన పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు సీఎం జగన్‌.. సుమారు గంట పాటు ఇద్దరి మధ్య ముఖాముఖి చర్చలు సాగాయి.. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు హీట్‌ పుట్టిస్తున్న తరుణంలో జరిగిన ఈ భేటీకి ప్రధాన్యత ఏర్పడగా.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను షా దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్‌..

అమిత్‌షాతో సీఎం జగన్‌ చర్చించిన అంశాలను ఓసారి పరిశీలిస్తే..

1. కృష్ణాజలాల అంశంపై అభ్యంతరం వ్యక్తంచేసిన సీఎం జగన్‌.. తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపేయాలని కోరారు..

2. KWDT-II యొక్క నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో 5 SLPలు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం. గతంలో ఇదే అంశంపై రెండు సార్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లానని వివరించారు.. 17.08.2021న, తర్వాత 25-06-2022న తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు.

3. KWDT-IIకి విధివిధానాలు (ToR) జారీకి 4.10.2023న కేంద్ర మంత్రివర్గం ఆమోదం ఏపీ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తంచేసిన సీఎం. విధివిధానాలను బేసిన్‌లోని కర్ణాటక, మహారాష్ట్రలకు కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పరిమితం చేయడం అశాస్త్రీయమన్న సీఎం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, తదుపరి చర్యలు తీసుకోకుండా సంబంధిత వ్యక్తులను ఆదేశించవలసిందిగా విజ్ఞప్తి చేశారు సీఎం జగన్‌.

4. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై అమిత్‌షాతో చర్చించారు సీఎం జగన్‌.. ప్రాజెక్టు పూర్తి నిర్మాణం వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాల్సి ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలని అభ్యర్థించారు.. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం 55,548.87 కోట్లుగా ఇప్పటికే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.. 5. పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు డబ్బు విడుదలచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన గతంలో పలుమార్లుచేసిన విజ్క్షప్తి మేరకు రూ.12,911.15 కోట్ల విడుదలకు ఆమోదం లభించిందని, అయితే దీన్ని పునఃపరిశీలించి తాజాగా అంచనాలను రూపొందించామన్న సీఎం. లైడార్‌ సర్వేప్రకారం అదనంగా 36 ఆవాసాల్లో ముంపు కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి ఇంకా రూ.17,144.06 కోట్లు అవసరమవుతాయని ఆమేరకు నిధులు విడుదలచేయాలని అభ్యర్థించారు. 6. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులనుంచి ఖర్చుచేసిన రూ.1,355 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.