Leading News Portal in Telugu

Chennai: ఓ వ్యక్తి అకౌంట్కు రూ.2000 పంపితే రూ.753 కోట్లు జమ..


చెన్నైకి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడి ఖాతాకు రూ.2,000 బదిలీ చేస్తే.. శనివారం తన బ్యాంకు ఖాతాలో రూ.753 కోట్లు జమ అయింది. నగరంలోని ఫార్మసీ ఉద్యోగి మహమ్మద్ ఇద్రిస్ తన కోటక్ మహీంద్రా బ్యాంక్ ఖాతా నుండి శుక్రవారం తన స్నేహితుడికి డబ్బు పంపాడు. ఆ తర్వాత అతని బ్యాలెన్స్ తనిఖీ చేశాడు.

అతని బ్యాలెన్స్‌ను పరిశీలించగా.. తన ఖాతాలో రూ.753 కోట్లు ఉన్నట్లు గుర్తించాడు. ఇద్రిస్ వెంటనే ఈ విషయాన్ని బ్యాంక్ దృష్టికి తీసుకువెళ్లాడు. దీంతో వెంటనే అతని ఖాతాను ఆపేశారు. సాంకేతిక లోపం కారణంగా డబ్బులు జమ అయినట్లు అతనికి సమాచారం ఇచ్చాడు. ఇటీవలి కాలంలో.. ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతాలో అసాధారణంగా అధిక మొత్తంలో పడటం ఇదేం కొత్త కాదు.

తాజాగా చెన్నైలోని ఓ ట్యాక్సీ డ్రైవర్ స్నేహితుడి ఖాతాకు రూ.21వేలు ట్రాన్స్ ఫర్ చేయగా.. రూ.9వేల కోట్లు అతని బ్యాంకు ఖాతాలో జమ కావడంతో షాక్ కు గురయ్యాడు. 30 నిమిషాల తర్వాత.. తమిళనాడ్ మర్కంటైల్ బ్యాంక్ తమ తప్పును గ్రహించి ఆ డబ్బును వెనక్కి తీసుకుంది. అయితే ఈ విషయంపై ఖాతాదారుడు స్పందిస్తూ.. తాను మధ్యాహ్నం నిద్రిస్తున్న సమయంలో డబ్బులు తన అకౌంట్ లో పడ్డాయని చెప్పాడు. లేచి చూసేసరికి తనకు మెస్సేజ్ వచ్చిందని.. అంత మొత్తంలో సున్నాలు చూసి ఆశ్చర్యానికి గురయ్యానని.. అంత మొత్తాన్ని లెక్కించలేకపోయానని ఆ వ్యక్తి చెప్పాడు.