
Israel-Hamas War: శనివారం ఇజ్రాయిల్పై హమాస్ మిలిటెంట్లు జరిపిన దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్, హమాస్ ఉగ్రవాదులపై విరుచుకుపడుతోంది. గాజాలోని బిల్డింగులతో పాటు యూనిర్సిటీలు, మసీదులు ఇలా హమాస్ ఉగ్రవాదులు ఉన్నారనే అనుమానం ఉన్న అన్ని ప్రాంతాలపై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ మరణాల సంఖ్య 3000కి చేరింది. ఇజ్రాయిల్ లో 1200 మందికి పైగా మరణించారు. అంతేస్థాయిలో గాజాలోని ప్రజలు మరణిస్తున్నారు.
ఇదిలా ఉంటే గాజాను అన్ని వైపుల నుంచి దిగ్భంధించింది ఇజ్రాయిల్. బుధవారం గాజాలోని ఏకైక విద్యుత్ కేంద్రం పనిచేయడం మానేసింది. దీంతో గాజా ప్రాంతం పూర్తిగా అంధకారం నెలకొంది. ఇదిలా ఉంటే హమాస్ కిడ్నాప్ చేసిన ఇజ్రాయిల్ పౌరులను విడిచిపెట్టే వరకు గాజాలో కుళాయి నీరు రాదని, విద్యుత్ ఆన్ కాదు, ఇంధనం రాదని ఇజ్రాయిల్ ఇంధన మంత్రి ఇజ్రాయిల్ కాట్జ్ హెచ్చరించారు.
హమాస్ ఉగ్రవాదులు శనివారం జరిపిన దాడిలో దాదాపుగా 150 మంది ఇజ్రాయిలీలను బందీలుగా పట్టుకున్నారు. వీరందరిని గాజా ప్రాతానికి తీసుకెళ్లారు. 2.3 మిలియన్ జనాభా ఉన్న గాజాలో అంధకరం అలుముకుంది. తాము ఎన్నో యుద్ధాలను చూశాం, వీటి మధ్యే బతుకుతున్నా కానీ ఇలాంటి దాడులను ఎప్పుడూ చూడలేదని గాజా పౌరులు చెబుతున్నారు. రాత్రి సమయంలో సెల్ ఫోన్ లైట్లతో కాలం వెళ్లదీస్తున్నామని తెలిపారు.