Leading News Portal in Telugu

SI Mains Exam: నేడు, రేపు ఎస్సై మెయిన్స్‌ పరీక్షలు.. అభ్యర్థులు ఇవి మర్చిపోవద్దు..


SI Mains Exam: నేడు, రేపు ఎస్సై మెయిన్స్‌ పరీక్షలు.. అభ్యర్థులు ఇవి మర్చిపోవద్దు..

SI Mains Exam: ఈ రోజు, రేపు.. ఈ నెల 14, 15 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ ఎస్సై పోస్టుల భర్తీకి సంబంధించిన మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి.. ఈ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రంలో నాలు­గు కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు.. విశాఖపట్నం, ఏలూరు, గుంటూ­రు, కర్నూలులో శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు మెయిన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.. మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్ష ఉండగా.. ఆబ్జెక్టివ్‌ విధానంలో రెండు పేపర్లు, డిస్క్రిప్టివ్‌ విధానంలో మరో రెండు పేపర్లు ఉండనున్నాయి.. కాగా, ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో మెయిన్‌ పరీక్షకు మొత్తం 31,193 మంది అర్హత సాధించారు. వీరిలో 27,590 మంది పురుష అభ్యర్థులు.. 3,603 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు..

ఈ రోజు పేపర్‌–1 అంటే డిస్క్రిప్టివ్‌ విధానంలో జరిగే పరీక్ష నిర్వహించనున్నారు.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. పేపర్‌–2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనుండగా.. రేపు ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహించే పేపర్‌–3 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు..
పేపర్‌–4 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల నిర్వహించనున్నారు.. ఇక, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే ఎస్సై పరీక్షలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.. అభ్యర్థుల ఎత్తు కొలిచే పరికరాల్లో తప్పిదం వల్ల వేలాది మంది విద్యార్థులు అర్హత కోల్పోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 2019లో అర్హత సాధించిన అభ్యర్థులు 2023లో ఎలా అనర్హతకు గురవుతారని ధర్మాసనం ప్రశ్నించింది. ఎత్తు విషయంలో తమకు అర్హత వున్నప్పటికీ తమని అన్యాయంగా అనర్హతకు గురి చేశారని దాఖలైన పలు పిటిషన్లు మీద హైకోర్టు విచారణ చేపట్టింది. రెండు సైటేషన్లను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనర్హత పొందిన అభ్యర్థులు అందరికీ మళ్లీ శరీర ధారుడ్యం పరీక్షలకు అనుమతించాలని కోర్టు ఆదేశించింది. ఎలక్ట్రానిక్ యంత్రంతో కాకుండా మాన్యువల్‌గా పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే..

ఇక, ఎస్సై మెయిన్స్‌ రాసే అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు అధికారులు.. అభ్యర్థులు తమ హాల్‌టిక్కెట్‌, ఇతర ధ్రువీకరణ పత్రాలతో రావాలి.. ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.. ఉదయం 10 గంటలకు మొదటి పరీక్ష ప్రారంభం అవుతుంది.. మధ్యాహ్నం 2.30 గంటలకు రెండో పరీక్ష స్టార్ట్‌ చేస్తారు.. అభ్యర్థుల బయోమెట్రిక్‌, ఫింగర్‌ ప్రింట్స్‌ తీసుకుంటారు. మెయిన్స్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు 4 పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు తీసుకురావాల్సి ఉంటుంది.. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌, స్మార్ట్‌ వాచ్‌ తదితర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి ఉండదు.. పరీక్షా కేంద్రాల్లోకి అధికారులు సైతం సెల్‌ఫోన్‌ తీసుకువెళ్లకుండా నిబంధన తీసుకొచ్చారు. ఉదయం 9 గంటలకే కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతి ఇస్తారు.. కానీ, నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులకు అనుమతించబోమని స్పష్టం చేశారు అధికారులు.