Leading News Portal in Telugu

CM Jagan: రేపు విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్


CM Jagan: రేపు విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్

సీఎం జగన్ రేపు విశాఖ పట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పరిశీలిస్తున్నారు. విశాఖలో ఐటీ సెజ్‌ హిల్‌ నంబర్‌ – 2లోని ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. అనంతరం ఫార్మాసిటీలో కొత్తగా నిర్మించిన యూజియా స్టెరిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని, లారస్‌ ల్యాబ్స్‌లో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని, యూనిట్‌ – 2 ఫార్ములేషన్‌ బ్లాక్‌ను, ఎల్‌.ఎస్‌.పి.ఎల్‌ యూనిట్‌ – 2ను సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు.

సీఎం జగన్ రేపు ఉదయం గన్నవరంలో బయలుదేరి 10.20 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధురవాడ ఐటీ హిల్స్‌కు చేరుకుంటారు. హిల్‌ నంబరు 3పై దిగి రోడ్డు మార్గంలో హిల్‌ నంబర్‌ 2పై ఏర్పాటు చేసిన ‘ఇన్ఫోసిస్‌’ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు వెళ్లనున్నారు. 10.50 గంటల నుంచి 11.55 గంటల వరకు అక్కడే ఉంటారు. ఆ సెంటర్‌ను ప్రారంభించి, ఉద్యోగులతో కాసేపు సీఎం జగన్ ముచ్చటిస్తారు. తిరిగి హెలిపాడ్‌ దగ్గరకు చేరుకొని అక్కడ జీవీఎంసీ ఏర్పాటు చేసిన బీచ్‌ క్లీనింగ్‌ యంత్రాలను ఆరంభిస్తారు. ఆ తరువాత హెలికాప్టర్‌లో 12.05 గంటలకు బయలుదేరి అనకాపల్లి జిల్లా పరవాడ చేరుకుంటారు. అక్కడ కొద్దిసేపు ప్రజా ప్రతినిధులతో మాట్లాడి, ఆ తరువాత ఫార్మాసిటీలో యుగియా స్టెరైల్‌ ఫార్మా కంపెనీని ప్రారంభిస్తారు.

ఆ తర్వాత సీఈఓ, డైరెక్టర్లతో సీఎం జగన్ మాట్లాడతారు. కార్యక్రమం 1.10 గంటలకు ముగించుకొని హెలికాప్టర్‌లో అచ్యుతాపురం మండలంలోని ఏపీఎస్‌ఈజెడ్‌కు వెళ్లనున్నారు. అక్కడ 1.30 గంటల నుంచి 1.45 గంటల వరకు ప్రజా ప్రతినిధులతో మాట్లాడి, లారస్‌ లేబొరేటరీస్‌కి వెళ్లి యూనిట్‌-2ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2.35 గంటల వరకు అక్కడే ఉండనున్నారు. అనంతరం హెలికాప్టర్‌లో విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి 3.20 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని అక్కడి నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటారు.