Leading News Portal in Telugu

CM YS Jagan: నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన..



Ys Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు.. విశాఖతో పాటు అనకాపల్లి జిల్లాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగనుంది.. ఐదు గంటల పాటు జరిగే ఈ టూర్‌లో ఐటీ, ఫార్మా కంపెనీల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి.. ఋషికొండ ఐటీ సెజ్ లో ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ ను ప్రారంభించనున్న సీఎం.. కాగా, రూ. 35 కోట్ల పెట్టుబడితో వెయ్యిమంది ఉద్యోగులతో సాప్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది ఇన్ఫోసిస్. ప్రారంభోత్సవం అనంతరం ఉద్యోగులు, ఇన్ఫోసిస్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం జగన్.. ఇక, బీచ్ క్లీనింగ్ కోసం జీవీఎంసీ కొనుగోలు చేసిన ఆరు యంత్రాలును సీఎం ప్రారంభించనున్నారు..

Read Also: Viral Video : వార్నీ.. ఏం తెలివి బాసూ.. ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయి..

మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం అనకాపల్లి జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన ప్రారంభం కానుంది.. పరవాడ ఫార్మాసిటీలో ఫార్మా, యూజియా స్టెరిల్స్‌ ప్రెవేట్‌ లిమిటెడ్ యూనిట్, లారస్‌ సింథసిస్‌ ల్యాబ్స్‌ ప్రేవేట్‌ లిమిటెడ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.. పార్టీ స్థానిక నాయకత్వంతో సమావేశం కానున్నారు వైసీపీ అధినేత.. ఇక, అచ్యుతాపురం ఏపీసెజ్‌లో లారస్‌ ల్యాబ్స్‌ లో నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని, యూనిట్‌ 2 ఫార్ములేషన్‌ బ్లాక్‌ను ప్రారంభిస్తారు.. పరవాడ, అచ్యుతాపురంలో స్థానిక నాయకత్వంతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. మొత్తంగా ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పర్యటన కోసం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి.. మధ్యాహ్నం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు.