వలస నేతలకే పెద్ద పీట.. కాంగ్రెస్ తొలి జాబితా ప్రత్యేకత | 11 migrant leaders got tickets in congress first list| telangana| minampally| jupalli| nagam
posted on Oct 16, 2023 6:09PM
కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. భారీ కసరత్తులు, సమాలోచనల అనంతరం విడుదల చేసిన జాబితాలో ప్రత్యేకత ఏమిటంటే.. కొత్తగా పార్టీలో చేరిన 11 మందికి టికెట్లు ఇచ్చారు. మొత్తంగా 12 మంది కొత్తవారికి టికెట్లు లభించింది. కొల్హాపూర్, నకిరేకల్లో కొత్తగా వచ్చిన వారికి టికెట్లు దక్కాయి. ఇటీవల పార్టీలో చేరిన వేములకు నకిరేకల్ సీటు దక్కింది. అలాగే నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి కుమారుడు జయవీర్ పోటీ చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి వచ్చి చేరిన మైనంపల్లి హనుమంతరావు కుటుంబంలో ఇద్దరికి సీట్లు లభించాయి. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు డబుల్ టికెట్లు దక్కాయి. జానారెడ్డి అడిగిన మిర్యాలగూడ సీటును మాత్రం హైకమాండ్ పెండింగ్లో ఉంచింది. ఐతే.. నాగర్ కర్నూలులో నాగం ఫ్యామిలీకి టికెట్ దక్కలేదు. ఓసీలకు 26 సీట్లు, బీసీలకు 12 సీట్లు, ఎస్సీలకు 11 సీట్లు, ఎస్టీలకు 2 సీట్లు దక్కాయి. అలాగే.. రెడ్డి సామాజిక వర్గం వారికి 17 సీట్లు, వెలమ వర్గానికి 7 సీట్లు, బ్రాహ్మణ వర్గానికి 2, మైనార్టీలకు 3 సీట్లు దక్కాయి. ఖమ్మంలో ఇద్దరు సిట్టింగ్లను మాత్రమే ఈ జాబితాలోపేర్లు ప్రకటించారు. మధిర నుంచి మల్లు భట్టి విక్రమార్క పోటీ చేస్తుండగా.. భద్రాచలం నుంచి పొడెం వీరయ్య బరిలో దిగుతున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తొలి జాబితాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావుకు సీట్లు దక్కలేదు. కొత్తగూడెం సీటు సీపీఐకి కేటాయించే అవకాశం ఉండటం వల్లే, పొంగులేటి సీటు ఎక్కడ అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే తుమ్మల నాగేశ్వరరావు సీటు విషయంలో హైకమాండ్ డైలమాలో ఉన్నట్లు సమాచారం. అలాగే కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీకి టికెట్ కన్ఫర్మ్ చేయలేదు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి కొత్తగా వచ్చి చేరిన వారిలో 11 మందికే సీట్లు దక్కాయి
* మెదక్ – మైనంపల్లి రోహిత్ రావు
*మల్కాజ్ గిరి – మైనంపల్లి హన్మంత రావు
*నిర్మల్ – కూచడి శ్రీహరి రావు
* నకిరేకల్ – వేముల వీరేశం
* ఆర్మూర్ – వినయ్ కుమార్ రెడ్డి
* బాల్కొండ – సునీల్ రెడ్డి
* జహీరాబాద్ – ఎ. చంద్ర శేఖర్
* కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణ రెడ్డి
* గద్వాల – సరిత
* కొల్లాపూర్ – జూపల్లి కృష్ణ రావు
* నాగర్ కర్నూల్ – కుచుకుళ్ల రాజేష్ రెడ్డి
ఇక పోతే కాంగ్రెస్ తొలి జాబితాలో ఆరుగురు మహిళలకు పార్టీ టికెట్లు ఇచ్చింది.
1. ములుగు – సీతక్క
2. సనత్ నగర్ – కోట నీలిమ
3. గోషామహల్ – మొగిలి సునీత
4. గద్వాల్ – సరిత తిరుపతయ్య
5. కోదాడ – పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి
6. స్టేషన్ ఘన్ పూర్ – సింగాపురం ఇందిర
ఇక బీసీలకు 12 టికెట్లు దక్కాయి.
1. వేములవాడ – ఆది శ్రీనివాస్
2. మేడ్చల్ – తోటకూర వజ్రేష్ యాదవ్
3. సనత్ నగర్ – కోట నీలిమ
4. గోషామహల్ – మొగిలి సునీత
5. చాంద్రాయణగట్ట – బోయ నగేష్
6. యాకుత్ పుర – రవి రాజు
7. బహదూర్పురా – రాజేష్ కుమార్ పులిపాటి
8. సికింద్రాబాద్ – ఆదం సంతోష్
9. గద్వాల – సరిత
10. ఆలేరు – బీర్ల ఐలయ్య
11. షాద్ నగర్ – శంకరయ్య
12) ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్
ఇక టికెట్ ఆశించి భంగపడ్డ నేతలలో ముందుగా చెప్పుకోవలసింది నాగం జనార్దన్రెడ్డి. ఆయన బీజేపీలో ఉన్నప్పుడు కనీసం ప్రెస్మీట్ పెట్టుకోవడానికి కూడా ఆ పార్టీ అవకాశం ఇచ్చేది కాదు. ఆయన ఏమైనా మాట్లాడాలంటే సెక్రటేరియట్ వెళ్ళి అక్కడ మీడియా పాయింట్ వద్ద మాట్లాడేవారు. దీంతో బిజెపిలో అవమానాలు భరించలేక ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఆశించినా టికెట్ దక్కలేదని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తొలి జాబితా విడుదల అయిన తరువాత.. ప్రకటించిన నియోజకవర్గాలను బట్టి చూస్తే నాగ సహా 11 మంది టికెట్ ఆశించి భంగపడ్డారు. వారు..
1. నాగం జనార్ధన్ రెడ్డి (నాగర్ కర్నూల్)
2. జగదీశ్వర్ రావు (కొల్లాపూర్)
3. రాగిడి లక్ష్మారెడ్డి (ఉప్పల్)
4. మేడ్చల్ (హరివర్థన్ రెడ్డి)
5. కుద్బుల్లాపూర్ (భూపతి రెడ్డి)
6.సంగిశెట్టి జగదీశ్వర్ రావు (ముషీరాబాద్)
7.మర్రి ఆదిత్య రెడ్డి (సనత్ నగర్)
8. రాఘవేందర్ రెడ్డి (కల్వకుర్తి)
9. మెట్టు సాయి కుమార్ (గోషామహల్)
10. చక్లోకర్ శ్రీనివాస్ (మలక్ పేట్)
11. ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్ (షాద్ నగర్)