
Bhatti Vikramarka: సోనియా గాంధీ తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలో బుద్ది చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగులు నిండాలని రామప్ప దేవాలయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పూజలు చేసి దేవున్ని వేడుకున్నారని ఆయన వెల్లడించారు. ములుగులో కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసి దేశ సంపద ప్రజలకు చెందాలని నినదించిన మహా నాయకుడు రాహుల్ గాంధీ అంటూ ఆయన కొనియాడారు.
రాజుల నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితో నియంత పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడుదామంటూ భట్టి విక్రమార్క ప్రజలకు సూచించారు. తెలంగాణ సంపద, వనరులు ప్రజలకు చెందాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని.. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. తెలంగాణ సంపద వనరులు ప్రజలకు పంచడానికి సోనియా గాంధీ 6 గ్యారంటీలను ప్రకటించారన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ప్రతి గ్యారెంటీ రాష్ట్ర సంపద వనరులు ప్రజలకు పెంచడానికే అంటూ భట్టి విక్రమార్క వెల్లడించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను గడప గడపకు తీసుకువెళ్లి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇస్తామన్నారు. ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ..” రైతులకు ఎకరానికి 15000 చొప్పున రైతుబంధు సాయం చేస్తాం. మహిళలకు 500 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితంగా కల్పిస్తాం అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ 4వేల రూపాయలు ఇస్తాం.” అని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.