
Bangladesh coach Chandika Hathurusingha praises India fearless cricket: భారత్ అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉందని, సొంత గడ్డపై ప్రత్యర్థులను భయపెడుతోందని బంగ్లాదేశ్ కోచ్ చండిక హతురుసింగ అన్నాడు. ఇటీవల భారత్పై తమ రికార్డు మెరుగ్గా ఉందని, అయితే వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియాతో తలపడి గెలవాలంటే ఎంతో కష్టపడాలన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో బంగ్లాదేశ్ కోచ్ మాట్లాడాడు.
‘వన్డే ప్రపంచకప్ 2023లో బరిలోకి దిగిన భారత్ అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉంది. జట్టులో స్ట్రైక్ బౌలర్లు ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా తిరిగి ఉత్తమ స్థితికి చేరుకున్నాడు. మిడిల్ ఓవర్లలో అనుభవజ్ఞులైన స్పిన్నర్లు ఉన్నారు. బ్యాటింగ్లో అయితే టాప్ ఆర్డర్ చెలరేగుతోంది. ఎలాంటి భయం, బెరుకు లేని క్రికెట్ ఆడుతున్న భారత్ ప్రత్యర్థులను భయపెడుతోంది. ప్రస్తుతం రోహిత్ సేన క్రికెట్ను ఆస్వాదిస్తోంది. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్లో టీమిండియాకు గొప్ప మద్దతు లభిస్తోంది’ అని బంగ్లాదేశ్ కోచ్ చండిక హతురుసింగ అన్నాడు.
‘భారత్తో మ్యాచ్లో మా కెప్టెన్ షకిబ్ అల్ హాసన్ పూర్తి ఫిట్నెస్తో ఉంటేనే ఆడతాడు. ఇంకా ఓ స్కాన్ ఫలితం ఇంకా రావాల్సి ఉంది. మ్యాచ్కు ముందు అతడు ఆడడంపై నిర్ణయం తీసుకుంటాం. ఇటీవల భారత్పై మా రికార్డు మెరుగ్గా ఉంది. అయితే ప్రపంచకప్లో టీమిండియాపై గెలవాలంటే ఎంతో కష్టపడాలి. ముఖ్యముగా మా బ్యాటర్లు రాణించాలి. బౌలర్లు త్వరగా వికెట్స్ తీయాలి’ అని చండిక హతురుసింగ పేర్కొన్నాడు. భారత్, బంగ్లాదేశ్ తలపడిన చివరి నాలుగు వన్డేల్లో టీమిండియా మూడు మ్యాచ్లలో ఓడింది. చివరగా ఆసియా కప్ 2023 సూపర్-4 దశలో ఓటమి చవిచూసింది.