
Vijayapura : సకాలంలో కరెంటు ఇవ్వకపోవడంతో కర్ణాటక రైతులు విసుగు చెందిపోయారు. దీంతో హెస్కామ్ సబ్ స్టేషన్ యూనిట్ ఆవరణలోకి మొసలిని తీసుకొచ్చిన ఘటన విజయపూర్ జిల్లా కొల్హార తాలూకా రోనిహాల్ గ్రామంలో చోటుచేసుకుంది. రాత్రుళ్లు ఆలస్యంగా కరెంటు ఇస్తున్నారని, చీకట్లో పొలాలకు వెళ్లి నీరందిస్తే ఎలా అని రైతులు వాపోయారు. చీకట్లో జలచరాల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. వారికి కూడా ఇలాంటివి గుర్తు చేసేందుకు రైతు ఈ చర్యకు పాల్పడ్డాడు.
రాత్రిపూట కరెంటు ఇస్తే ఏం లాభం? మా సమస్యను అధికారులు అర్థం చేసుకునేందుకే మొసలిని తీసుకొచ్చామన్నారు. రైతుల భూములకు పగటిపూట త్రీఫేజ్ విద్యుత్ అందడం లేదు. పగటిపూట త్రీఫేజ్ కరెంటు లేక నానా అవస్థలు పడుతున్న రైతన్నలు నిద్రలేచి అర్థరాత్రి నీళ్ల కోసం పొలాలకు పోవాల్సి వస్తుంది. గత రాత్రి పొలంలో తిరుగుతుండగా మొసలి కనిపించడంతో పట్టుకుని ట్రాక్టర్ ద్వారా విద్యుత్తు పంపిణీ కేంద్రానికి తీసుకొచ్చారు. చివరకు అటవీశాఖ అధికారులు రైతులను ఒప్పించి మొసలిని తీసుకెళ్లారు.