Leading News Portal in Telugu

Nara Chandrababu: నా ప్రాణాలకు ముప్పు ఉంది.. ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ!


Nara Chandrababu: నా ప్రాణాలకు ముప్పు ఉంది.. ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ!

Chandrababu Naidu Writes Letter to ACB Court Judge: టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు మరియు ఆందోళన వ్యక్తం చేస్తూ.. 3 పేజీల లేఖ రాశారు. అక్టోబర్ 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు పంపారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనను చంపాలని కొందరు కుట్ర పన్నుతున్నారంటూ లేఖలో బాబు పేర్కొన్నారు.

‘నేను రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫొటోలు తీశారు. నా పరువు, ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే వీడియో ఫుటేజ్‌ రిలీజ్‌ చేశారు. నన్ను అంతమొందించేందుకు వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. నాపై కుట్ర పన్నుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ఓ లేఖ వచ్చింది. అయితే ఆ లేఖపై ఇప్పటివరకు పోలీసు అధికారులు ఏ విచారణ చేపట్టలేదు’ అని మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు.

‘రాజమండ్రి జైలులో ఎన్నో ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు జైలులోకి గంజాయి ప్యాకెట్లు విసిరారు. తోటలో ఉన్న కొందరు ఖైదీలు గంజాయిని తీసుకున్నారు. జైలులో ఉన్న ఖైదీల్లో 750 మంది తీవ్ర నేరాలకు పాల్పడినవారే. కొంతమంది ఖైదీల వల్ల నా భద్రతకు ముప్పు పొంచి ఉంది. అక్టోబర్ 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా ఓ డ్రోన్‌ ఎగిరింది. ములాఖత్‌లో భాగంగా నన్ను కలుస్తున్న వారి చిత్రాల కోసం డ్రోన్‌ ఉపయోగిస్తున్నారు. నాతో పాటు నా కుటుంబసభ్యులకు కూడా ప్రమాదం ఉంది’ అని నారా చంద్రబాబు తన లేఖలో రాసుకొచ్చారు.