posted on Oct 27, 2023 1:36PM
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం హాట్ హాట్గా మారింది. ప్రధాన పార్టీలన్నీ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే.. దూసుకుపోతోంది. అయితే.. రాష్ట్రంలో పోటీ కేవలం బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉండగా.. ఈసారి కొత్త పార్టీలు కూడా బరిలో దిగుతున్నాయి. అందులో.. వైఎస్ షర్మిల నేతృత్వంలోనే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రత్యేకం.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉమ్మడి గుర్తును కేటాయించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బైనాక్యులర్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీతో విలీనంపై ఢిల్లీకి వెళ్లి షర్మిల చర్చలు జరిపారు. అయితే ఆ తర్వాత విలీనం అంశం ముందుకు కదల్లేదు. దీంతో తాము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని షర్మిల స్పష్టం చేశారు.